మోడీ చూపు ఎవరి వైపు?: రాష్ట్రపతి రేసులో వెంకయ్య, సుష్మా సహా వీరే
భారత 15వ రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం తెరతీసింది. జూలై 17న ఎన్నిక నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో బిజెపి నుంచి రేసులో ఎవరు? విపక్షాల నుంచి ఎవరు బరిలో నిలుస్తారనే చర్చ సాగుతోంది.
న్యూఢిల్లీ: భారత 15వ రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం తెరతీసింది. జూలై 17న ఎన్నిక నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో బిజెపి నుంచి రేసులో ఎవరు? విపక్షాల నుంచి ఎవరు బరిలో నిలుస్తారనే చర్చ సాగుతోంది.
బిజెపిలో పలువురి పేర్లు వినిపిస్తున్నాయి. ద్రౌపది ముర్ము, సుష్మా స్వరాజ్, థవార్ చంద్ గెహ్లాడ్, వెంకయ్య నాయుడు తదితర పేర్లు వినిపిస్తున్నాయి. పార్టీలో చర్చించి, అభ్యర్థిని ప్రకటిస్తామని బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా చెప్పారు.
జూలై 17న రాష్ట్రపతి ఎన్నిక, 20న లెక్కింపు
తొలుత అద్వానీ పేరు వినిపించింది. ఇప్పుడు ఆ పేరు వినిపించడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీ హఠాత్తుగా మరెవరినైనా ఎంపిక చేసే అవకాశాలు కొట్టి పారేయలేమని అంటున్నారు.
బిజెపికి రాష్ట్రపతి ఎన్నిక ఇప్పుడు చాలా ముఖ్యం. యూపీ ఎన్నికల్లో గెలుపుతో పాటు ఇతర పార్టీలు మద్దతిస్తున్నందున ఎన్డీయే అభ్యర్థి గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అదే సమయంలో త్వరలో గుజరాత్, కర్నాటక రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ సమయంలో రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపు మరింత ముఖ్యం. గెలిస్తేనే బిజెపికి దేశవ్యాప్తంగా ఆదరణ లభిస్తుందని చెప్పుకోవచ్చు.
ప్రస్తుతానికి ఎన్డీయే అభ్యర్థిగా నలుగురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే వారు నలుగురే కాకుండా తెరపైకి మరొకరు వచ్చినా ఆశ్చర్యం లేదంటున్నారు. సుష్మా స్వరాజ్, ద్రౌపది ముర్ము, తవార్ చంద్ గెహ్లాట్, వెంకయ్య నాయుడుల పేర్లు చక్కెర్లు కొడుతున్నాయి.
ద్రౌపది ముర్ము
ద్రౌపది ముర్ము ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్గా ఉన్నారు. రెండు దశాబ్దాలకు పైగా ఆమె రాజకీయాల్లో ఉన్నారు. ఆమెను రాష్ట్రపతి అభ్యర్థిగా బిజెపి ఎంచుకుంటే తొలి ట్రైబల్ రాష్ట్రపతి అవుతారు. దివంగత బిరంచి నారాయణ తుడు కూతురు ఈమె. ఒడిశాకు చెందిన రాజకీయ నాయకురాలు. ఒడిశాలో మంత్రిగా కూడా పని చేశారు.
తవర్ చంద్ గెహ్లాట్
తవర్ చంద్ గెహ్లాట్ 1948 మే 18న జన్మించారు. ప్రస్తుతం నరేంద్ర మోడీ ప్రభుత్వంలో మంత్రిగా పని చేస్తున్నారు. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 1996 నుంచి 2009 వరకు షాజాపూర్ నుంచి లోకసభకు ప్రాతినిథ్యం వహించారు.
సుష్మా స్వరాజ్
విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కూడా రాష్ట్రపతి రేసులో ఉన్నారు. సుష్మ ఆరోగ్యం కారణంగా మంత్రిగా కొనసాగించలేకపోవచ్చునని అంటున్నారు. బిజెపి సాధ్యమైనంత వరకు రాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం కావాలని కోరుకుంటోంది. కానీ కాంగ్రెస్ సహా పలు విపక్షాలు మాత్రం అందుకు సిద్ధంగా లేవు.
వెంకయ్య నాయుడు
వెంకయ్య నాయుడు రాష్ట్రపతి అభ్యర్థి రేసులో ఉన్నారని, ఉప రాష్ట్రపతి అభ్యర్థి రేసులో ఉన్నారని ప్రచారం సాగుతోంది. బిజెపికి రాజ్యసభలో వెంకయ్య నాయుడు వంటి నేత అవసరం. కాబట్టి ఆయనను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంచుకోవచ్చునని అంటున్నారు.