విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి: ఎవరీ గోపాలకృష్ణ గాంధీ?
న్యూఢిల్లీ: విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా గాంధీజీ మనవడు, పశ్చిమబెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీని ఎంపిక చేసినట్లు ప్రకటించాయి. ఉపరాష్ట్రపతి ఉమ్మడి అభ్యర్థిని ఖరారు చేసేందుకు విపక్ష పార్టీలు మంగళవారం ఢిల్లీలోని పార్లమెంటు లైబ్రరీ హాల్లో సమావేశమయ్యాయి.
దాదాపు 18 పార్టీలు ఏకగ్రీవంగా ఆయన ఎంపికను ఖరారు చేశాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ ఆయనకు గతంలోనే పూర్తి మద్దతునిచ్చారు.
రాష్ట్రపతి అభ్యర్థిగా ఆయనను నిలబెట్టాలనే ప్రతిపాదనను కూడా మమతే తీసుకొచ్చారు. కానీ చివరికి మాత్రం లోక్సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ను ఎంపిక చేశారు. ఆగస్టు 5న ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. అదేరోజు ఫలితాల లెక్కింపు చేపట్టనున్నారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ పదవీ కాలం ఆగస్టు 19తో ముగియనుంది.
కాగా, గోపాలకృష్ణ గాంధీ ఐఏఎస్ అధికారిగా పదవీ విరమణ చేశారు. సౌతాఫ్రికా, లండన్లో హైకమిషనర్గా గతంలో పని చేశారు గోపాలకృష్ణ గాంధీ. ఎన్డీఏ అభ్యర్థిగా ధీటైనా పోటీని ఇవ్వాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్, విపక్షాలు గోపాలకృష్ణను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
గోపాలకృష్ణ ప్రస్థానం
మహాత్మాగాంధీ మనవడైన గోపాలకృష్ణ గాంధీ ఏప్రిల్ 22, 1945లో దేవదాసు గాంధీ, సీ రాజగోపాలచారి కూతురు లక్ష్మీలకు జన్మించారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఇంగ్లీష్ లిటరేచర్లో మాస్టర్స్ చేశారు గోపాలకృష్ణ. 1968-1992 మధ్య కాలంలో ఆయన ఐఏఎస్గా సేవలందించారు. తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో ఆయన ఐఏఎస్గా సేవలందించారు. ఆ తర్వాత ఆయన స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశారు.
1985-1987 మధ్య కాలంలో ఉపరాష్ట్రపతికి సెక్రటరీగా పనిచేశారు. 1987-1992 మధ్య కాలంలో జాయింట్ సెక్రటరీగా, 1997లో రాష్ట్రపతికి సెక్రటరీగా పని చేశారు. యూకే భారత హై కమిషన్లో మంత్రి(కల్చరల్)గా సేవలందించారు.
లండన్లోని నెహ్రూ కేంద్రానికి డైరెక్టర్గా విధులు నిర్వహించారు. 1996లో సౌతాఫ్రికాలో హై కమిషనర్గా పని చేశారు. 2000లో శ్రీలంకలో భారత హై కమిషనర్గానూ సేవలందించారు. నార్వేలో భారత రాయబారిగా కూడా పనిచేశారు గోపాలకృష్ణ. 2000-2007 వరకు పశ్చిమబెంగాల్ గవర్నర్గా పనిచేశారు.