దీపావళి క్రాకర్స్పై నిషేధం - నవంబర్ 10 నుంచి 30వ తేదీ వరకూ- ఎక్కడెక్కడంటే...
దేశవ్యాప్తంగా ఈసారి దీపావళి సంబరాలపై కరోనా ప్రభావం పడింది. ఈ సీజన్లో కరోనా వ్యాప్తి సెకండ్వేవ్ అవకాశాలు ఉన్నాయని ఓవైపు ప్రమాద హెచ్చరికలు వెలువడుతుండగా...ఈ ప్రభావం దీపావళి సంబరాలపైనా పడింది. కరోనా వ్యాప్తికి ఎక్కువగా అవకాశాలు ఉన్నందున పలు రాష్ట్రాల్లో ఇప్పటికే బాణాసంచా క్రయ విక్రయాలపై ప్రభుత్వాలు, న్యాయస్ధానాలు నిషేధం విధిస్తున్నాయి. ఇదే క్రమంలో దేశవ్యాప్తంగా కాలుష్య కారక ప్రాంతాలన్నింటిలోనూ బాణాసంచాను నిషేధిస్తూ జాతీయ హరిత ట్రైబ్యునల్ ఉత్తర్వులు ఇచ్చింది.
దీపావళి సందర్భంగా దేశవ్యాప్తంగా గాలి కాలుష్యం ఎక్కువగా ఉన్న అన్ని పట్టణాలు, నగరాల్లో నవంబర్ 10 నుంచి 30వ తేదీ వరకూ బాణాసంచా అమ్మకాలు, కొనుగోళ్లను నిషేధిస్తూ గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశాలు ఇచ్చింది. ఎన్జీటీ ఛైర్పర్సన్ ఆదర్శ్ కుమార్ గోయల్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. కాలుష్య ప్రభావం మధ్యస్ధంగా లేదా ఎక్కువగా ఉన్న అన్ని నగరాలు, పట్టణాల్లో గ్రీన్ క్రాకర్స్ మాత్రమే అనుమతించాలని, లేదంటే రెండు గంటలు మాత్రమే కాల్చుకునే అవకాశం ఇవ్వాలని ధర్మాసనం ప్రభుత్వాలకు సూచించింది.
కాలుష్య ప్రభావాన్ని గుర్తించేందుకు గతేడాది నవంబర్ నుంచి అందుబాటులో ఉన్న డేటాను ప్రామాణికంగా తీసుకోవాలని జాతీయ హరిత ట్రైబ్యునల్ స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా గ్రీన్ ట్రైబ్యునల్ ఒడిశా, రాజస్ధాన్, సిక్కిం, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే క్రాకర్స్ నిషేధించిన విషయాన్ని ఎన్టీటీ ధర్మాసనం గుర్తుచేసింది. పలు రాష్ట్రాలు తమకు పర్యావరణ హితమైన గ్రీన్ క్రాకర్స్ కాల్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరినా కాలుష్య ప్రభావం తక్కువగా ఉంటేనే అనుమతి ఇవ్వాలని సూచించింది.