కేంద్రంతో రైతుల రెండో విడత చర్చల వేళ: ఢిల్లీ, ఘజియాబాద్ బోర్డర్ లో నిరసన, నేషనల్ హైవే 9 దిగ్బంధం
కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చలో ఢిల్లీ లో భాగంగా ఆందోళన చేస్తున్న రైతులు, నేడు కేంద్రం రెండో విడత చర్చలు జరపనున్న నేపథ్యంలో కూడా తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ బోర్డర్లో భారీగా మోహరించిన రైతులు పలు మార్గాలను బ్లాక్ చేశారు. ఢిల్లీ నోయిడా మార్గాన్ని నిన్న దిగ్బంధించిన రైతులు, ఈరోజు ఘజియాబాద్ ఢిల్లీ సరిహద్దులోని జాతీయ రహదారి 9 ని దిగ్బంధించారు.
యుపి గేట్ సమీపంలో జాతీయ రహదారి -9 ని దిగ్బంధించిన రైతులు
భారతీయ కిసాన్ యూనియన్ (బికెయు) నిరసనకారులు రైతు ఆందోళనలను ఉధృతం చేశారు . గురువారం ఉదయం యుపి గేట్ సమీపంలో ఉన్న జాతీయ రహదారి -9 ని అడ్డుకున్నారు. ఈ చర్య వల్ల ఘజియాబాద్ నుంచి ఢిల్లీకి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దేశంలో వ్యవసాయ వాణిజ్యాన్ని సరళీకృతం చేయడానికి ప్రయత్నిస్తున్న వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా కొనసాగుతున్న నిరసనలో భారతీయ కిసాన్ యూనియన్ కీలక భూమిక పోషిస్తోంది. నిరసనకారులు శనివారం నుండి యుపి గేట్ ఫ్లైఓవర్ కింద ఆందోళన తెలియజేస్తున్నప్పటికీ ఈ ఉదయం వరకు రోడ్లు లేదా రహదారులను అడ్డుకోలేదు.
ఘజియాబాద్ నుండి ఢిల్లీ కి ట్రాఫిక్ ఇబ్బంది
కానీ ఈ రోజు మధ్యాహ్నం మహాధర్నా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు . ఇప్పటివరకు యుపి గేట్ ఫ్లైఓవర్ కింద నిరసన చేస్తున్న రైతులు హైవేపైకి వచ్చి ఘజియాబాద్ నుండి ఢిల్లీకి వెళ్లే ట్రాఫిక్ ను అడ్డుకున్నారు. హైవే ప్రాంతాన్ని ఖాళీ చేయడానికి మా అధికారులు రైతులతో చర్చలు జరుపుతున్నారని, ప్రస్తుతం ట్రాఫిక్ కి పెద్ద ఇబ్బంది లేదని జిల్లా మేజిస్ట్రేట్ అజయ్ శంకర్ పాండే అన్నారు.జాతీయ రహదారి 9 ని సుదూర ప్రయాణికులు హపూర్, మొరాదాబాద్ మరియు లక్నో వంటి నగరాలకు వెళ్లడానికి ఉపయోగిస్తారు.
నేడు రైతులతో కేంద్రం మరోమారు భేటీ
ఎన్హెచ్-9 లోని యుపి గేట్ ఫ్లైఓవర్ను ఘజియాబాద్ మరియు నోయిడా నుండి ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణికులు ఢిల్లీకి వెళ్లడానికి ఉపయోగిస్తున్నారు. నిరసన నేపథ్యంలో గత శనివారం నుండి ఫ్లైఓవర్ కింద ఉన్న ప్రాంతం ఇప్పటికే దిగ్బందించబడింది . ఇక నేడు జాతీయ రహదారి 9ని దిగ్బంధించారు . ఇక నేడు మధ్యాహ్నం విజ్ఞాన్ భవన్ లో రైతులతో మరోమారు చర్చలు జరగనున్నాయి. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రైతు సంఘ నేతలతో కేంద్ర మంత్రులు భేటీ నిర్వహించనున్నారు.
డిమాండ్స్ పరిష్కరించకుంటే రిపబ్లిక్ డే పెరేడ్ లో ఆందోళన
ఇప్పటికే తమ అభ్యంతరాలను అన్నదాతలు లిఖితపూర్వకంగా కేంద్రానికి సమర్పించారు. అయితే కేంద్రం దీనిపై సానుకూలంగా స్పందించకపోతే తమ డిమాండ్లను నెరవేర్చకపోతే, రిపబ్లిక్ డే పెరేడ్ లో ఆందోళన చేస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు ఉద్యమిస్తామని తేల్చి చెబుతున్నారు. మరి నేటి భేటీలో కేంద్రం రైతుల డిమాండ్స్ కు తలొగ్గుతుందా అనేది వేచి చూడాలి.