ఐదుగురు కార్యకర్తల అరెస్ట్: మహారాష్ట్ర, డీజీపీకి ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఐదుగురు సామాజిక కార్యకర్తల అరెస్టులను సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవ హక్కుల కమిషన్.. మహారాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర డీజీపీకి నోటీసులు జారీ చేసింది. ఐదుగురు కార్యకర్తల అరెస్ట్ వ్యవహారంలో వ్యవహారంలో ప్రామాణిక పద్ధతులను అనుసరించలేదని ఆరోపించింది. అంతేగాక, ఇది వారి మానవ హక్కుల ఉల్లంఘనే అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ మేరకు మహారాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై నాలుగు వారాల్లో వాస్తవిక నివేదిక సమర్పించాలని జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) కోరింది.
దేశ వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లోని పలు నగరాల్లో మానవ హక్కుల కార్యకర్తల అరెస్టులపై నివేదికలను హక్కుల సంఘం పరిశీలించిన తర్వాత నోటీసులు పంపించామని ఎన్హెచ్ఆర్సీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కాగా, ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలతో పుణె పోలీసులు దేశంలోని వివిధ ప్రాంతాల్లో సామాజిక కార్యకర్తల ఇళ్లపై ఆకస్మిక దాడులు చేసి, అరెస్టులు చేశారు.
విరసం నేత వరవరరావు, అరుణ ఫెరారీ, వెర్నాన్ గోన్ సాల్వేస్, రోనా విల్సన్, న్యాయవాది సురేంద్ర, సుధా భరద్వాజ్, గౌతమ్ నావ్లాఖ్ ఇళ్లపై సోదాలు నిర్వహించారు. అనంతరం వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో వీరి అరెస్టులకు నిరసనగా దేశ వ్యాప్తంగా వివిధ ప్రజా సంఘాలు నిరసనలు చేపట్టాయి.