టాయ్లెట్స్ లేకే అత్యాచారాలు: ఎన్హెచ్ఆర్సి నోటీసులు
న్యూఢిల్లీ: దేశంలోని సుమారు 62 కోట్ల మంది ప్రజలకు మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడంతో వారు బహిర్భూమికి వెళ్తున్నారని తెలిసి జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సి) మండిపడింది. మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడం వల్ల బహిర్భూమికి వెళుతున్న మహిళల్లో 30శాతం లైంగిక దాడుల బారిన పడుతున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ అంశంపై మీడియాలో వస్తున్న వార్తలు వాస్తవమే అయితే మానవ హక్కులు తీవ్రంగా ఉల్లంఘనకు గురవుతున్నట్లేనని వ్యాఖ్యానించింది. అందుబాటులో ఉన్న మరుగుదొడ్ల సంఖ్యపై నాలుగు వారాల్లో నివేదిక సమర్పించాలని కేంద్రానికి, రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సోమవారం నోటీసులు పంపింది.
2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో సగం కుటుంబాలకు మరుగుదొడ్లే లేవని, వారంతా బహిరంగ మల విసర్జన చేస్తున్నారని ఓ మీడియాలో వార్తాకథనం వచ్చింది. మహిళలపై అత్యాచారాలు, లైంగిక వేధింపులకు కారణం ఇదేనని అందులో పేర్కొంది. దీన్ని గుర్తించిన జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా స్వీకరించింది.
ఇది నిజమే అయితే తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని కేంద్ర పారిశుధ్య, తాగునీటి వనరుల శాఖ కార్యదర్శికి, అన్ని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులను హెచ్చరించింది.