బెంగళూరుతో సహ దేశంలో ఉగ్రదాడులకు కుట్ర, సీక్కెట్ స్కెచ్, జేఎంబీ ఉగ్రవాది అరెస్టు!
న్యూఢిల్లీ/బెంగళూరు: బెంగళూరు నగరంతో పాటు దేశంలోని ఇతర ప్రముఖ నగరాల్లో ఉగ్రదాడులు చెయ్యడానికి ప్రయత్నాలు చేసి తప్పించుకుని తిరుగుతున్న ఉగ్రవాదిని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు. జమాత్ ఉల్ ముజాహుద్దీన్ బంగ్లాదేశ్ (జేఎంబీ) ఉగ్రవాది మోసరఫ్ హుసేన్ అలియాస్ హుసేన్ అనే నిందితుడిని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు.
బెంగాల్ నివాసి
పశ్చిమ బెంగాల్ లోని ముషరాబాద్ జిల్లా రఘునాథ్ గంజ్ ప్రాంతానికి చెందిన హుసేన్ జేఎంబీ ఉగ్రవాద సంస్థలో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. జేఎంబీ ఉగ్రవాద సంస్థకు ఆకర్షితుడైన హుస్సేన్ ఆ సంస్థలో చేరి ఉగ్రవాద నాయకుల ఆదేశాలను పాలిస్తున్నాడని ఎన్ఐఏ అధికారుల ప్రాథమిక విచారణలో వెలుగు చూసింది.
బెంగళూరులో దాడులు
హుస్సేన్ ను అరెస్టు చేసిన ఎన్ఐఏ అధికారులు మంగళవారం పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాలోని ప్రత్యేక కోర్టులో హాజరు పరిచి తరువాత న్యాయస్థానం అనుమతి తీసుకుని బెంగళూరు తీసుకు వచ్చి విచారణ చెయ్యాలని నిర్ణయించారు. గత జులై నెలలో బెంగళూరులోని చిక్కబాణవారలోని ఇంటిలో ఎన్ఐఏ అధికారులు దాడులు చేశారు.
బాంబులు, గన్ సీజ్
చిక్కబాణవారాలోని ఇంటిలో దాడులు చేసిన ఎన్ఐఏ అధికారులు అక్కడ ఐదు గ్రానెట్ లో, ఐఇడీ బాంబులు, ఎయిర్ గన్ తదితర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. దాడుల సమయంలో హుసేన్ (22) అనే ఉగ్రవాది చాకచక్యంగా తప్పించుకుని అక్కడి నుంచి పరారైనాడు.
విధ్వంశాలకు పక్కాప్లాన్
జేఎంబీ ఉగ్రవాద సంస్థ సభ్యులు బెంగళూరులో తలదాచుకుని ఆ నగరంతో పాటు దేశంలోని ఇతర ప్రముఖ నగరాల్లో ఉగ్రవాదాడులు చెయ్యాలని ప్లాన్ వేశారని ఎన్ఐఏ అధికారులకు సమాచారం అందింది. 2018 మార్చి నెలలో బెంగళూరు చేరుకున్న ఉగ్రవాది హుసేన్ తరువాత ఇదే నగరంతో పాటు దేశంలోని ఇతర నగరాల్లో విధ్వంశాలు సృష్టించాలని అతని సహచరులతో కలిసి ప్లాన్ వేశాడని ఎన్ఐఏ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.