విశాఖ హనీట్రాప్: గూఢచర్యం కేసులో బిగ్ ఫిష్: కింగ్పిన్ అరెస్ట్: గోధ్రాలో: పాక్ ఏజెంట్గా
అహ్మదాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖపట్నం హనీట్రాప్, గూఢచర్యం కేసులో మరో బిగ్ ఫిష్ బయటపడింది. నౌకాదళానికి చెందిన అత్యంత కీలక సమాచారాన్ని పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ పంపించి కేసులో కీలక పాత్ర పోషిస్తున్నట్లుగా అనుమానిస్తోన్న వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు అరెస్టు చేశారు. అతనిపై అత్యంత కఠినమైన అసాంఘిక కార్యకలాపాల నివారణ చట్టం (యూఏపీఏ), అధికారిక రహస్యాల చట్టం (ఓఎస్) కింద కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఓ ప్రకటనలో వెల్లడించారు.
మిస్టీరియస్ వీనస్: శుక్రుడిపై గ్రహాంతరవాసులు?: భూమిపై విస్తారంగా దొరికే కెమికల్..వీనస్ మేఘాల్లో
విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా పనిచేస్తోన్న తూర్పు నౌకాదళానికి చెందిన కొందరు అధికారుల చుట్టూ హనీట్రాప్ను పన్నడం, వారి నుంచి కీలక సమాచారాన్ని సేకరించి పాకిస్తాన్కు చేరవేయడానికి ప్రయత్నించిన కేసు ఇది. నౌకాదళంలో కీలక స్థానాల్లో పనిచేస్తోన్న అధికారులను పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్లు ఫేస్బుక్, వాట్సప్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫాంల ద్వారా హనీట్రాప్ చేశారు. వారి నుంచి నౌకాదళానికి చెందిన కీలక సమాచారాన్ని సేకరించారు. దీనికి సంబంధించిన ఓ రాకెట్ను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు 2019లో బట్టబయలు చేశారు. ఈ కేసులో విడతలవారీగా 14 మందిని అరెస్టు చేశారు. వారిపై ఛార్జిషీటును నమోదు చేశారు.
తాజాగా గుజరాత్లోని గోధ్రా సమీపంలోని పంచమహల్లో నివసిస్తోన్న గిటెలి ఇమ్రాన్ అనే 37 సంవత్సరాల వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై ఐపీసీలోని 120/బీ, 121ఏ, యూఏపీఏ చట్టం లోని 18, 18 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పాకిస్తాన్ గూఢచారులు, ఏజెంట్లతో ఇమ్రాన్కు సంబంధాలు ఉన్నాయనే విషయం తమ దర్యాప్తులో తేలిందని ఎన్ఐఏ అధికార ప్రతినిధురాలు సోనియా నారంగ్ వెల్లడించారు. గిటేలి ఇమ్రాన్ పాకిస్తాన్ ఐఎస్ఐ కోసం గూఢచర్యం చేస్తున్నట్టుగా స్పష్టమైందని అన్నారు. విశాఖపట్నంలోని నౌకాదళ రహస్యాలను సేకరించడానికి అతను కుట్ర పన్నాడని చెప్పారు.
NIA Arrests a Key Accused in Visakhapatnam Espionage Case pic.twitter.com/I8QnbPRf8R
— NIA India (@NIA_India) September 15, 2020
ఈ క్రమంలో కొందరు నౌకాదళ అధికారులకు ఇమ్రాన్ భారీగా ముడుపులు అందజేసినట్టు తమ దర్యాప్తులో వెల్లడైనట్లు పేర్కొన్నారు. హవాలా మార్గాల్లో నేవీ సిబ్బందికి నిధులు సమకూర్చినట్టు గుర్తించామని సోనియా నారంగ్ తెలిపారు. దీనికోసం పాకిస్తాన్ గూఢచారులు.. ఐెఎస్ఐ ఏజెంట్లు జూనియర్ స్థాయి అధికారులను ట్రాప్ చేయడానికి ప్రయత్నించిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది.
Recommended Video
అందమైన అమ్మాయిలను జూనియర్ స్థాయి అధికారులకు వలగా విసిరి, వారిచుట్టూ హనీట్రాప్ పన్నారంటూ 2019లో జాతీయ దర్యాప్తు సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. తాజాగా అరెస్టయిన ఇమ్రాన్.. దీనికి సూత్రధారిగా ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.