పైకి సాధారణ కంటి వైద్యుడు... కానీ... ఎన్ఐఏ అరెస్టుతో బయటపడ్డ అసలు లింకులు..
బెంగళూరులోని ఎంఎస్ రామయ్య మెడికల్ కాలేజీలో నేత్ర వైద్యుడిగా పనిచేస్తూ ఐసిస్ కోసం ఓ మెడికల్ అప్లికేషన్ను రూపొందిస్తున్న అబ్దుర్ రెహమాన్ అనే వ్యక్తిని సోమవారం(అగస్టు 17) ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. దాడుల సందర్భంగా గాయపడే ఐసిస్ ఉగ్రవాదులకు సహాయం చేయడంతో పాటు వారి ఆయుధ సంబంధిత ప్రయోజనాలతో ముడిపడిన ఓ అప్లికేషన్ను రెహమాన్ అభివృద్ది చేస్తున్నట్లు గుర్తించామని ఎన్ఐఏ తాజా ప్రకటనలో వెల్లడించింది.
బయటపడ్డ లింకులు...
బెంగళూరులోని బసవనగుడి నివాసి అయిన రెహమాన్(28) 2014లో సిరియాలోని మెడికల్ క్యాంపును కూడా సందర్శించాడని ఎన్ఐఏ తమ ప్రకటనలో పేర్కొంది.అక్కడ గాయపడ్డ ఐసిస్ ఉగ్రవాదులకు రెహమాన్ చికిత్స అందించాడని,దాదాపు 10 రోజులు అక్కడే ఉన్నాడని తెలిపింది. ఈ ఏడాది మార్చిలో ఢిల్లీలోని జామియా నగర్లో అరెస్టయిన కశ్మీరీ దంపతులైన జహన్జైబ్ సమి వని, హీనా బషీర్ బీగ్లపై దర్యాప్తులో భాగంగా వారితో రెహమాన్ లింకులు కూడా బయటపడ్డాయి.
మరో ఇద్దరి అరెస్ట్...
జహన్జైబ్,హీనా బషీర్లకు ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖోరసన్ ప్రావిన్స్(ISKP)తో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో ఈ ఏడాది మార్చిలో ఢిల్లీ పోలీస్ స్పెషల్ విభాగం వారిపై కేసు నమోదు చేసింది. ఐఎస్కేపీ అనే సంస్థ ఐసిస్ అనుబంధ సంస్థగా పనిచేస్తోంది. ఈ దర్యాప్తు సందర్భంగా సదియా అన్వర్ షేక్,నబీల్ సిద్దిఖ్ ఖత్రీ అనే పుణేకి చెందిన ఇద్దరిని ఎన్ఐఏ అరెస్ట్ చేసింది. సీఏఏ ఆందోళనలను హైజాక్ చేసి భారత్లో ఐసిస్/ఐఎస్కేపీ కార్యకలాపాలకు వీరు కుట్ర చేసినట్లుగా గుర్తించింది.
నేరం అంగీకరించిన వైద్యుడు...
ఎన్ఐఏ విచారణ సందర్భంగా అబ్దుర్ రెహమాన్ నేరం అంగీకరించాడు. జహన్జైబ్,సిరియాకు చెందిన మరికొందరు ఐసిస్ ఉగ్రవాదులతో కలిసి కుట్రకు పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. అతని అరెస్టు అనంతరం బెంగళూరులో అతనికి సంబంధించిన మరో మూడు చోట్ల ఎన్ఐఏ తనిఖీలు చేపట్టింది. ఈ క్రమంలో పలు డిజిటల్ పరికరాలు,మొబైల్ ఫోన్,ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకుంది. త్వరలోనే అతన్ని ఢిల్లీలోని ఎన్ఐఏ కోర్టు ముందు ప్రవేశపెట్టి కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది.