ఉగ్రవాద సంస్థ ఐఎస్ కోసం పనిచేస్తున్న ఇద్దరి అరెస్ట్: ఎన్ఐఏ దర్యాప్తు
బెంగళూరు: ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ కోసం పనిచేస్తూ, దాని కోసం నిధులు సేకరించడం, ఆ సంస్థలో యువకులను చేర్పిస్తున్న ఇద్దరు వ్యక్తులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్ట్ చేసింది. తమిళనాడు, కర్ణాటకకు చెందిన ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
వీరిని తమిళనాడులోని రామనాథపురంకు చెందిన అహ్మద్ అబ్దుల్ కేదర్(40), బెంగళూరులోని ఫ్రెజర్ పట్టణానికి చెందిన ఇర్ఫాన్ నజీర్(33)గా ఎన్ఐఏ గుర్తించింది. 2013-14 మధ్య కాలంలో వీరు 13 మందిని బెంగళూరు నుంచి సిరియాకు తీసుకెళ్లినట్లు గుర్తించింది. వీరిలో ఇద్దరు సిరియాలో హత్యకు గురి కాగా, కొందరు 2014లో తిరిగి వచ్చారని, చాలా మంది ఇప్పటికీ పరారీలో ఉన్నారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.
2014లో ఇరాక్, సిరియాలపై ఐఎస్ ఉగ్రవాద సంస్థ పట్టుసాధించింది. కాగా, ఇరాక్ 2017లో ఈ ఉగ్రవాద సంస్థపై విజయం సాధించినట్లు ప్రకటించింది. 2019 మార్చిలో సిరియాలో అమెరికా మద్దతు ఉన్న దళాలు ఈ ఉగ్రవాద సంస్థను ఓడించాయని, దీంతో ఈ గ్రూపు ప్రాదేశిక నియంత్రణకు ముగింపు పలికాయని వెల్లడించింది.
కాగా, తాజాగా చేధించిన మాడ్యూల్లోని సభ్యులందరినీ ఎన్ఐఏ గుర్తించింది. వీరు సన్నిహితంగా ఉన్నవారి గురించి, వీరి కార్యకలాపాల గురించి తెలుసుకోవడానికి ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది.
ఒక బ్యాంకు వ్యాపార విశ్లేషకుడిగా ఉన్న అబ్దుల్, కుటుంబ వ్యాపారం చేస్తున్న నాసిర్.. ఐఎస్ ఉగ్రవాద సంస్థకు నిధులు సేకరించడంతోపాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని పలువురిని సిరియాకు పంపిందని ఎన్ఐఏ తేల్చింది. జహన్ జైబ్ సమి, హినా బషీర్ బేగ్ కేసుకు సంబంధించి గత ఆగస్టులో బెంగళూరులో అరెస్టైన నేత్ర వైద్య నిపుణుడు అబ్దుల్ రెహ్మాన్ను ప్రశ్నించగా.. తాజా సమాచారం తెలిసిందని ఎన్ఐఏ పేర్కొంది.