ఐసిస్ సానుభూతిపరుల కోసం జల్లెడ: ఉలిక్కిపడ్డ జనం!
కోయంబత్తూర్: తమిళనాడులోని కోయంబత్తూర్లో ఉగ్రవాద కదలికలతో ఉలిక్కిపడుతోంది. భయానక ఉగ్రవాద సంస్థ ఐసిస్ సానుభూతిపరులు తిష్ట వేశారంటూ పక్కా సమాచారం అందడంతో ఏకంగా జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) రంగంలోకి దిగింది. కోయంబత్తూర్ నగరాన్ని జల్లెడ పడుతోంది. నిద్ర లేస్తూనే భయానక వార్తను వినడంతో కోయంబత్తూర్ వాసులు ఆందోళనకు గురయ్యారు.
జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఈ తెల్లవారు జామున 5 గంటలకు కోయంబత్తూర్కు చేరుకున్నారు. ఆ వెంటనే- తమకు అందిన సమాచారానికి అనుగుణంగా అనుమానిత ప్రదేశాల్లో అన్వేషణ మొదలు పెట్టారు. కోయంబత్తూర్లోని పలు ప్రాంతాల్లో గాలింపు చర్యలను చేపట్టారు. అన్బునగర్, ఉక్కడం, కునియముత్తూర్, పోతనూర్ ప్రాంతాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. స్థానికుల నుంచి అభ్యంతరాలు తలెత్తే అవకాశాలు లేకుండా ముందు జాగ్రత్త చర్యగా సెర్చ్ వారెంట్లను కూడా వెంట తెచ్చుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఐసిస్ సానుభూతిపరులు తలదాచుకున్నట్లు తమకు పక్కా సమాచారం ఉందని పేర్కొన్నారు. ఈస్టర్ సండే సందర్భంగా రాజధాని కొలంబో సహా శ్రీలంకలోని పలు నగరాల్లో చోటు చేసుకున్న ఆత్మాహూతి దాడులకు, తాజాగా తాము చేపట్టిన గాలింపు చర్యలకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. ఇదివరకు తాము కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకోగా.. ఐసిస్ సానుభూతిపరులు కోయంబత్తూర్లో తలదాచుకున్నట్లు తమ దర్యాప్తులో తేలిందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని తాము అన్వేషణ చేపట్టినట్లు తెలిపారు.
Tamil Nadu: Searches being conducted at 7 locations in Coimbatore; #visuals from Anbu Nagar area. More details awaited pic.twitter.com/JCfriIKp0Y
— ANI (@ANI) June 12, 2019
శ్రీలంకలో ఆత్మాహూతి దళ సభ్యులు నరమేథాన్ని సాగించిన అనంతరం వారు ఉగ్రవాదులు భారత్కు చేరుకుని ఉండొచ్చంటూ వార్తలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. సముద్ర మార్గం గుండా వారు తమిళనాడులోని తీర ప్రాంత జిల్లాలైన రామనాథపురం, కడలూర్, నాగపట్టిణం సహా సేలం, ఈరోడ్ వంటి జిల్లాల్లో తలదాచుకుని ఉంటారనే అనుమానాలు వచ్చాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని అప్పట్లో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఆయా జిల్లాల్లో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే.