గోరఖ్నాథ్ ఆలయంలో కత్తితో దాడికి పాల్పడిన దోషికి మరణశిక్ష
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం గోరఖ్నాథ్ ఆలయంలోకి చొరబడి కత్తితో దాడికి పాల్పడిన ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది.
లక్నో: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం గోరఖ్నాథ్ ఆలయంలోకి చొరబడి కత్తితో దాడికి పాల్పడిన ఘటనలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోర్టు సోమవారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో నిందితుడు ముర్తాజా అబ్బాసీని దోషిగా తేల్చిన ఎన్ఐఏ కోర్టు.. అతడికి మరణశిక్ష విధించింది.
గత ఏడాది ఏప్రిల్ నెలలో గోరఖ్పూర్లోని గోరఖ్నాథ్ ఆలయంలో ముర్తజా అబ్బాసీ కత్తితో బీభత్సం సృష్టించాడు. ఆలయంలోకి బలవంతంగా ప్రవేశించేందుకు యత్నించిన అతడు.. అడ్డొచ్చిన యూపీ పీఏసీ జవాన్లపై దాడి చేశాడు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. అనంతరం పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా.. అబ్బాసీని పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారు.
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయం భక్తులతో నండిపోయిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఉగ్రకుట్రలో భాగంగానే నిందితుడు ఈ దాడికి పాల్పడినట్లు వార్తలు వచ్చాయి. దీంతో ఈ ఘటనపై ఉగ్రవాద నిరోధక బృందం(ఏటీసీ) దర్యాప్తు చేపట్టింది. విచారణలో అబ్బాసీ నుంచి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. తనకు ఐసిస్ ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నట్లు నిందితుడు దర్యాప్తులో అంగీకరించాడు.
సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో అబ్బాసీని ఎన్ఐఏ కోర్టు దోషిగా తేల్చింది. అతడికి మరణశిక్ష విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది. కాగా, అబ్బాసీ ఐఐటీ ముంబై నుంచి 2015లో కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగం కూడా చేశాడు. 2017 నుంచి అతడు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు అబ్బాసీ కుటుంబసభ్యులు దాడి ఘటన జరిగిన అనంతరం తెలిపిన విషయం తెలిసిందే.