కేరళ గోల్డ్ స్కాంలో కీలక పురోగతి: స్వప్నా సురేష్పై కఠిన చట్టాలను ప్రయోగించిన ఎన్ఐఏ
తిరువనంతపురం: కేరళలో రాజకీయ దుమారానికి దారి తీసిన కోట్ల రూపాయల గోల్డ్ స్కామ్ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ మరో కీలక ముందడుగు వేసింది. ఈ కేసులో నిందితులను ఇప్పటికే అరెస్టు చేసిన ఎన్ఐఏ అధికారులు.. కీలక చట్టం కింద కేసు నమోదు చేశారు. అవాంఛనీయ సంఘటనల నిరోధక చట్టం కింద వారిపై ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. సాధారణంగా ఈ చట్టం కింద ఉగ్రవాదులు, అసాంఘిక శక్తులపై ఎఫ్ఐఆర్ను నమోదు చేస్తుంటారు. ఇదే చట్టాన్ని గోల్డ్ స్కామ్ నిందితులపై ప్రయోగించారు.
స్వప్న సురేశ్ అరెస్ట్: బెంగళూరులో అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ..
ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తోన్న స్వప్నా సురేష్ సహా సరిత్ పీఎస్, ఫజల్ ఫరీద్, సందీప్ నాయర్పై అన్లాఫుల్ యాక్టివిటీస్ (ప్రీవెన్షన్) యాక్ట్-1967 కింద ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. ఈ కేసులో నిందితురాలు స్వప్నా సురష్ను జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు బెంగళూరులో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఆమెను కేరళకు తీసుకొచ్చారు. కోచిలోని ఎన్ఐఏ కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడే విచారణ కొనసాగిస్తున్నారు.
30 కిలోల బంగారం అక్రమ స్మగ్లింగ్ కేసులో స్వప్న సురేష్ ప్రధాన సూత్రధారి అని ఎన్ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కుంభకోణం కేరళలో ఏ స్థాయిలో రాజకీయ దుమారానికి దారి తీసిందో తెలిసిందే. ముఖ్యమంత్రి పినరయి విజయన్ రాజీనామా కోసం ప్రతిపక్ష యూడీఎఫ్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై స్మగ్లింగ్పై నిష్పక్షిపాతంగా దర్యాప్తు జరిపించాలంటూ పినరయి.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. ఫలితంగా- ఈ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు ఎంట్రీ ఇచ్చారు.
ఈ కేసులను తాము స్వాధీనంలోకి తీసుకున్న రెండోరోజే ఎన్ఐఏ అధికారులు స్వప్నా సురేష్ను అరెస్టు చేశారు. మరో ముగ్గురినీ అదుపులోకి తీసుకున్నారు. వారిపై కీలకమైన చట్టం కింద ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించే అసాంఘిక చట్టాన్ని వారిపై ప్రయోగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కాగా.. ఈ కేసులో పినరయి విజయన్ ప్రభుత్వంపై ఉద్యమించడానికి యూడీఎఫ్ కసరత్తు చేస్తోంది. బీజేపీ కూడా వెనక్కి తగ్గట్లేదు.