పుల్వామా ఉగ్రదాడి: రంగంలో దిగిన ఎన్ఐఎ: ఎఫ్ఐఆర్ నమోదు: దాడిని ఖండించిన న్యూజీలాండ్ పార్లమెంట్
న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లా అవంతిపురా వద్ద ఈ నెల 14వ తేదీన జైషె మహమ్మద్ ఉగ్రవాదులు జరిపిన దాడి ఘటనపై సమగ్ర విచారణ చేపట్టడానికి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) రంగంలోకి దిగింది. దీనిపై మరోసారి ఎఫ్ఐఆర్ ను నమోదు చేసింది. ఇప్పటికే ఎన్ఐఎకు చెందిన ప్రత్యేక దర్యాప్తు అధికారులు బృందం ఒకటి వరుసగా మూడురోజుల పాటు అవంతిపురాలో దాడి జరిగిన ప్రదేశాన్ని సందర్శించింది. స్థానికులను విచారించింది. కొన్ని కీలక ఆధారాలను సేకరించింది. దీనికి అనుగుణంగా ఎన్ఐఎ మరోసారి ఎఫ్ఐఆర్ ను నమోదు చేసింది.
ఎన్ఐఎ మరో ఎఫ్ఐఆర్
వారి నుంచి సేకరించిన వివరాలు, జమ్మూ కాశ్మీర్ పోలీసులు నమోదు చేసిన మొదటి ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించిన తరువాత తాజాగా మరోసారి ఎఫ్ఐఆర్ ను నమోదు చేసింది. తామే ఈ దాడికి పాల్పడినట్టు జైషె మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సంస్థకు పాకిస్తాన్ నుంచి ప్రోత్సాహం ఉందంటూ ఆరోపణలు చెలరేగుతున్నాయి. మొదట్లో చేసిన వాదననే పాక్ ఇప్పుడూ వినిపిస్తోంది. తమకు ఉగ్రవాద సంస్థలతో ఎలాంటి సంబంధం లేదని, భారత్ గనక యుద్ధానికి దిగితే, తాము ప్రతీకార చర్యకు దిగుతామని పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ వెల్లడించారు.
పాక్ ను ప్రపంచ దేశాల ముందు దోషిగా నిలపడం కోసమే
ఈ నేపథ్యంలో.. పుల్వామా దాడి ఘటన కేసును ఎన్ఐఎకు అప్పగించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నూటికి నూరు శాతం ట్రాక్ రికార్డు ఉన్న ఎన్ఐఎను రంగంలోకి దింపడం వెనుక ప్రధాన కారణం..పాకిస్తాన్ కు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాధారాలను సేకరించి, ఆ దేశాన్ని అంతర్జాతీయంగా దోషిగా చూపడమేనని చెబుతున్నారు. ఉగ్రవాద భూతానికి ఊతమిస్తున్న పాకిస్తాన్ ఉద్దేశపూరకంగానే దాన్ని తమదేశం మీదికి ఉసి గొల్పుతోందని నిర్ధారించడానికి అవసరమైన సాక్ష్యాధారాలను ఎన్ఐఎ సేకరిస్తుందని హోం మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రపంచ దేశాల ముందు పాకిస్తాన్ దోషిగా నిలబెట్టడం ద్వారా అంతర్జాతీయంగా ఏకాకిని చేయాలని భారత్ వ్యూహం.
పుల్వామా ఉగ్రదాడిని ఖండించిన న్యూజీలాండ్ పార్లమెంట్
ఇదిలావుండగా, పాకిస్తాన్ లోని భారత హై కమిషనర్ అజయ్ బిసారియా బుధవారం న్యూఢిల్లీలో హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు. పుల్వామా దాడి అనంతరం ఆయన రాజ్ నాథ్ సింగ్ తో భేటీ కావడం ఇదే తొలిసారి. పుల్వామా దాడిపై పాకిస్తాన్ వైఖరి ఏమిటనేది రాజ్ నాథ్ సింగ్ ఆయనను అడిగి తెలుసుకున్నారు. కాగా, పుల్వామా దాడిని న్యూజీలాండ్ పార్లమెంట్ ఖండించింది. ఈ మేరకు భారత్ కు తన మద్దతును తెలియజేస్తూ ఓ తీర్మానాన్ని ఆ దేశ పార్లమెంట్ ఆమోదించింది. పుల్వామా ఉగ్రదాడిని ఖండిస్తూ పార్లమెంట్ లో తీర్మానం చేసిన తొలి దేశం న్యూజీలాండ్. జైషె మహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్ పై అంతర్జాతీయంగా నిషేధం విధించే విషయంపై మరో రెండురోజుల్లో ఐక్యారాజ్య సమితిలో ప్రస్తావిస్తామని ఫ్రాన్స్ పేర్కొంది. అంతర్జాతీయ స్థాయిలో నిషేధం విధించడం వల్ల ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం ఉన్న ఏ దేశం కూడా మసూద్ కు ఆశ్రయం ఇవ్వకూడదు.