ఐసీఎస్ జాబితాలో ముగ్గురు కేరళ నివాసులు, కోర్టులో చార్జ్ షీట్, శ్రీలంక బాంబు పేలుళ్లతో !
తిరువనంతపురం: ప్రపంచంలోనే క్రూరమైన ఉగ్రవాదులుగా గుర్తింపు పొందిన ఐఎస్ఐఎస్ (ఐసీస్) ఉగ్రవాదులు కేరళలో గుట్టుచప్పుడు కాకుండా కార్యకలాపాలు సాగించడానికి సిద్దం అయ్యిందని వెలుగు చూసింది. కేరళకు చెందిన ముగ్గురిని ఐసీస్ జాబితాలో చేరుస్తూ ఎన్ఐఏ అధికారులు కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేశారు.
కర్ణాటకలోని మంగళూరు-కేరళలోని కాసరగూడు సరిహద్దు ప్రాంతంలో నివాసం ఉంటున్న అబూబక్కర్ సిద్దిక్, అహమ్మద్ ఆరాఫత్, కోల్లాం జిల్లా కరునాగహళ్ళికి చెందిన మోహమ్మద్ ఫైజల్ అనే నిందితులను గుర్తించిన ఎన్ఐఏ అధికారులు వారి పేర్లలను ఉగ్రవాదుల జాబితాలో చేర్చారు.
ఎర్నాకులంలోని ప్రత్యేక న్యాయస్థానంలో ఎన్ఐఏ అధికారులు ముగ్గురు నిందితుల మీద చార్జ్ షీట్ సమర్పించారు. ఈ ముగ్గురిని మరింత విచారణ చేసి వివరాలు సేకరించాలని ఎన్ఐఏ అధికారులు తీర్మానించారని సమాచారం. ఈ ముగ్గురు నిందితులు సిరియాలోని ఐసీస్ ఉగ్రవాద నాయకుడు అబ్దుల్ రశీష్ తో చర్చలు జరిపారని విచారణలో వెలుగు చూసిందని ఎన్ఐఏ అధికారులు కోర్టులో సమర్పించిన చార్జ్ షీట్ లో పొందుపరిచారు.
శ్రీలంకలో జరిగిన వరుస బాంబుపేలుళ్ల కేసు ప్రధాన సూత్రదారి అబ్దుల్ రశీద్ తో ఇప్పుడు అరెస్టు అయిన అబూబక్కర్ గతంలో టచ్ లో ఉన్నాడని అధికారులు అంటున్నారు. శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్లతో అబూబక్కర్ కు సంబంధం ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నామని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. మొత్తం మీద కేరళలో ఐసీఎస్ కార్యకలాపాలు సాగుతున్నాయని మరోసారి వెలుగు చూసింది.