పుల్వామా ఉగ్రదాడి పాకిస్థాన్ పనేనా? NIA ఏమంటోంది?
ఢిల్లీ : పుల్వామా ఉగ్రదాడి పాకిస్తాన్ పనేనా? అంటే అవుననే అంటోంది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ NIA. పుల్వామా ఉగ్రదాడిపై విచారణ వేగవంతం చేసిన ఎన్ఐఏ.. పాకిస్థాన్ హస్తం ఉన్నట్లు ధృవీకరించింది. ఆ మేరకు ఆధారాలు లభించినట్లు వెల్లడించారు ఎన్ఐఏ అధికారులు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఆదిల్ అహ్మద్ దార్ తో పాటు మరో నలుగురు జైషే మహమ్మద్ టెర్రరిస్టులు దాడిలో పాలుపంచుకున్నట్లు గుర్తించారు.
విచారణ స్పీడప్.. పాక్ పనే
పుల్వామా ఉగ్రదాడిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విచారణ స్పీడప్ చేసింది. ఆ దాడిలో మారుతి ఈకో వాహనం వాడినట్లు గుర్తించారు అధికారులు. ఆ వెహికిల్ కు సంబంధించిన యజమానిని ఇప్పటికే గుర్తించారు. ఇది దాదాపు ఎనిమిదేళ్ల కిందటే కశ్మీర్ లో రిజిస్టర్ అయినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదులు తన వాహనం వినియోగించుకుంటున్నారనే సమాచారం ఓనరుకు తెలుసంటున్నారు ఎన్ఐఏ అధికారులు. టెర్రరిస్టులు అటాక్ చేసిన తర్వాత వాహన యజమాని కనిపించకుండా పోయాడని చెబుతున్నారు. వీటన్నింటి నేపథ్యంలో పుల్వామా దాడి ఘటనలో పాకిస్థాన్ హస్తం ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుందని వెల్లడిస్తున్నారు.
ఆర్డీఎక్స్ ఎక్కడిది?
2018, మార్చి నెల నుంచి పత్తా లేకుండా పోయిన ఆదిల్ అహ్మద్ దార్.. అప్పటినుంచి కూడా జైషే మహమ్మద్ సంస్థకు పనిచేసినట్లు ఎన్ఐఏ అధికారులు తేల్చారు. పుల్వామా దాడి ఘటనలో వినియోగించిన వాహనంలో 25 కిలోల ఆర్టీఎక్స్ నింపినట్లు గుర్తించారు. అయితే ఇది ఉగ్రవాదులకు ఎలా చేరిందనే దానిపై ఇంకా విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం. సరిహద్దు ఆవలి వైపు నుంచే ఈ ఆర్డీఎక్స్ వచ్చినట్లు అనుమానిస్తున్నారు.
కక్షతోనే అలా..!
2018, జూన్ లో సీఆర్పీఎఫ్ సైనికులు ఆదిల్ అహ్మద్ దార్ ఇంటిని కనిపెట్టారు. ఆ క్రమంలో ఆదిల్ ఉంటున్న ఇంటిని తగులబెట్టే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఈ తతంగాన్ని సీరియస్ గా తీసుకున్న ఆదిల్.. జవాన్లపై కక్ష పెంచుకున్నట్లు ఎన్ఐఏ అధికారుల విచారణలో తేలింది. ఆ ఘటన జరిగిన వెంటనే ఆపరేషన్ బదర్ పేరుతో భద్రతా బలగాలపై జైషే టెర్రరిస్టులు గ్రెనేడ్ దాడులతో తెగబడ్డారు.