అరుదైన పరిణామం: కేరళ కోసం పాటలు పాడిన సుప్రీం జడ్జీలు(వీడియో)
న్యూఢిల్లీ: భారీ వర్షాలు, వదరల కారణంగా సర్వం కోల్పోయిన కేరళ బాధితుల కోసం విరాళాల సేకరణకు సోమవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో మనసును కదిలించే అరుదైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. కేరళ కోసం ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు స్వయంగా పాటలు పాడటం విశేషం.
జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ కెఎం జోసెఫ్లు ఇక్కడి ఓ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో విడివిడిగా పాడారు. ఈ న్యాయమూర్తులిద్దరూ కూడా కేరళకు చెందిన వారే. మత్స్యకారుడి జీవితాన్ని కళ్లకు కట్టే 'అమరం' అనే మలయాళచిత్రంలోని పాటను జస్టిస్ కెఎం జోసెఫ్ ఆలపించారు.
With Justice Kurian Joseph at the #KeralaFloodRelief initiative by #SupremeCourtJournalists at the Indian Society for International Law audi. We start in 10 mins after a quick jam. Come you guys and donate generously. #KeralaNeedsUs@prattyg pic.twitter.com/9H1k7T2UKc
— Mohit Chauhan (@_MohitChauhan) August 27, 2018
అనంతరం 'వియ్ షల్ ఓవర్కమ్ సమ్ డే' అనే పాటను జస్టిస్ కురియన్ జోసెఫ్, సినీ నేపథ్యగాయకుడు మొహిత్ చౌహాన్లు కలిసి పాడారు. కేరళ వరదబాధితుల సహాయార్థం సోమవారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొత్తం రూ.10 లక్షలకు పైగా నిధులు సమకూరాయి. కార్యక్రమానికి చీఫ్జస్టిస్ దీపక్మిశ్రా, పలువురు సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు.
కేరళ సీఎం విపత్తు సహాయ నిధికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఒక్కొక్కరూ రూ.25వేల చొప్పున సాయాన్ని అందచేశారు. అటార్నీజనరల్ కె.కె. వేణుగోపాల్ రూ.కోటిని విరాళంగా ఇచ్చారు. సీనియర్ న్యాయవాది, కెకె వేణుగోపాల్ కుమారుడు కృష్ణన్ వేణుగోపాల్ రూ.15లక్షలు ప్రకటించారు. మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి రూ.50 లక్షలు ప్రకటించారు. కాగా, కేరళ వరదల్లో సుమారు 370మందికిపైగా ప్రాణాలు కోల్పోగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. కేరళ ప్రజలకు అండగా దేశం మొత్తం నిలవడం మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు.