హిందీ సినిమాల్లో నటించిన ఆ దేశ సెలబ్రిటీ ఢిల్లీలో అరెస్టు..!
న్యూఢిల్లీ: నైజీరియాకు చెందిన ఓ సినిమా స్టార్ ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు అయ్యాడు. ఒలామిలేకన్ ఎం అకన్బీ ఒజోరా అనే ఈ నైజీరియా సెలబ్రిటీ ఢిల్లీ విమానాశ్రయంలో అనుమానాస్పదంగా తచ్చాడుతూ కనిపించాడు. ఇది చూసిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బంది ఒలామిలేకన్ను ప్రశ్నించారు. వారు వేసిన ప్రశ్నలకు పొంతన లేని సమాధానం చెబుతుండటంతో వారికి అనుమానం వచ్చి ఒలామిలేకన్ను ఉన్నతాధికారులకు అప్పగించారు.
ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒలామిలేకన్ తెల్లవారుజామున నాలుగుగంటల ప్రాంతంలో అనుమానాస్పద రీతిలో తచ్చాడుతూ కనిపించాడని సీఐఎస్ఎఫ్ సిబ్బంది చెప్పింది. తన చేతిలో గోవాకు వెళ్లేందుకు టికెట్ ఉందని విస్తారా ఎయిర్లైన్స్లో టికెట్ బుక్ చేసుకున్నట్లు చెప్పారు. ఇక ప్రశ్నల సందర్భంగా పొంతన లేని సమాధానాలు ఇస్తుండటంతో ఇమ్మిగ్రేషన్ అధికారులకు సమాచారం అందించినట్లు సీఐఎస్ఎఫ్ సిబ్బంది తెలిపింది.
ఇక ఇమ్మిగ్రేషన్ అధికారులు విచారణ ప్రారంభించగా ఒలామిలేకన్ వీసా 2011లో ఎక్స్పైర్ అయినట్లు అధికారులు చెప్పారు. ఇక అప్పటి నుంచి అక్రమంగా ఒలామిలేకన్ భారత్లో ఉన్నారని తెలిపారు. ఇక్కడ పలు హిందీ సినిమాల్లో కూడా నటించినట్లు అధికారులు వెల్లడించారు. నైజీరియాలో ఒలామిలేకన్కు స్టార్ స్టేటస్ ఉందని అక్కడ ఆయనో పెద్ద సెలబ్రిటీగా అధికారులు గుర్తించారు. ఇక తదుపరి విచారణ కోసం విచారణ సంస్థలకు ఒలామిలేకన్ను అప్పగించినట్లు సీఐఎస్ఎఫ్ ఉన్నతాధికారులు తెలిపారు.
భారత్లోకి చాలామంది అక్రమంగా ప్రవేశించి ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారు. అయితే సెలబ్రిటీలే ఇలా వ్యవహరించడంపై అధికారులు సీరియస్ అవుతున్నారు. ఒకదేశంలో స్టార్ స్టేటస్ అనుభవిస్తూ భారత్కు అక్రమంగా వచ్చి ఉండాల్సిన అవసరం ఏంటని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఎవరైనా వీసా గడువు ముగిసినప్పటికీ భారత్లో ఉంటే వెంటనే తమ దేశాలకు వెళ్లిపోవాల్సిందిగా అధికారులు సూచించారు. తనిఖీల్లో దొరికితే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుందని ఇమ్మిగ్రేషన్ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే నైజీరియన్లపై పలు కేసులు దేశవ్యాప్తంగా నమోదయ్యాయి. ఇందులో ఎక్కువగా డ్రగ్స్ కేసులు వీరిపై నమోదయ్యాయి. ఈ క్రమంలోనే పలు విచారణ సంస్థలు నైజీరియన్లపై ఓ డేగ కన్ను వేసి ఉంచాయి.