హర్యానాలో నైట్ కర్ఫ్యూ .. వీరికే మినహాయింపు , కరోనా కట్టడికి హర్యానా సర్కార్ కీలక నిర్ణయం
భారతదేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి . ఇక హర్యానా రాష్ట్రంలోనూ కరోనా కేసులు నమోదవుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది . దీంతో హర్యానా రాష్ట్రంలో రాత్రి తొమ్మిది గంటల నుండి ఉదయం 5 గంటల వరకు రాత్రి కర్ఫ్యూ విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం ప్రజలందరూ కోవిడ్ నిబంధనలను తప్పకుండా పాటించాలని పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీ లో నైట్ కర్ఫ్యూ ... ఏప్రిల్ 30 వరకు, కరోనా కట్టడికి కేజ్రీ సర్కార్ నిర్ణయం
రాత్రి తొమ్మిది గంటల నుండి ఉదయం 5 గంటల మధ్య నైట్ కర్ఫ్యూ
రాత్రి తొమ్మిది గంటల నుండి ఉదయం 5 గంటల మధ్య నైట్ కర్ఫ్యూ విధించబడుతుంది అని , తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇది అమలులో ఉంటుందని హర్యానా హోం మరియు ఆరోగ్య మంత్రి అనిల్ విజ్ పేర్కొన్నారు. ఇటీవల రాష్ట్రంలో కోవిడ్ -19 కేసుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
ఈ ఉత్తర్వులో పోలీసులు, అత్యవసర సేవా సిబ్బంది, మిలిటరీ లేదా సెంట్రల్ పోలీస్ ఫోర్స్ సిబ్బంది వంటి ఫ్రంట్లైన్ కార్మికులకు నైట్ కర్ఫ్యూ నుండి మినహాయింపు లభిస్తుందని పేర్కొన్నారు .
నైట్ కర్ఫ్యూ నుండి మినహాయింపు వీరికే
మీడియా, ఆరోగ్యం, విద్యుత్ లేదా అగ్నిమాపక విభాగంలో పనిచేసే వారు తమ విధులను నిర్వర్తించడానికి రాత్రి సమయంలో బయటకు వెళ్లడానికి అనుమతినిచ్చారు.
గర్భిణీ స్త్రీలు మరియు వైద్య పరిస్థితులతో ఉన్నవారు కూడా ఆసుపత్రులకు లేదా వైద్య కేంద్రాలకు వెళ్లడానికి అనుమతించబడతారు. రాత్రి వేళల్లో ప్రయాణించాలనుకునే ఎవరైనా కర్ఫ్యూ పాస్ పొందాలి. అంతర్-రాష్ట్ర రవాణాపై ఎటువంటి నిషేధం ఉండదు. రాత్రి కర్ఫ్యూ సమయంలో, ఆసుపత్రులు, మెడికల్ ల్యాబ్స్ మరియు ఎటిఎంలు తెరిచి ఉంటాయి.
కరోనా మహమ్మారి కారణంగా 16 మరణాలు
ఇటీవల కోవిడ్ -19 కేసుల్లో బాగా నమోదైన 16 రాష్ట్రాలలో హర్యానా ఒకటి.
కరోనా కట్టడి యత్నాల్లో భాగంగా హర్యానా సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది . ఆదివారం, హర్యానాలో కరోనా మహమ్మారి కారణంగా 16 మరణాలు సంభవించాయి. దీంతో హర్యానా రాష్ట్రంలో మొత్తం మరణించిన వారి సంఖ్య 3,268 గా నమోదయింది. మొత్తం కరోనావైరస్ కేసుల సంఖ్య ఆదివారం 3,440 కేసులతో కలిపి 3,16,881 కు పెరిగిందని ఆరోగ్య శాఖ బులెటిన్ తెలిపింది.
రాత్రి సమయాల్లో ఎవరూ బయటకు రావద్దని , నైట్ కర్ఫ్యూ నిబంధనలు అమలు
ఇక రాత్రి సమయాల్లో ఎవరూ బయటకు రావద్దని , నైట్ కర్ఫ్యూ నిబంధనలు అమలులో ఉంటాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక తాజా కేసులలో గుర్గావ్లో 1,084, ఫరీదాబాద్ 445, కర్నాల్ 264 మంది కరోనా బారిన పడ్డారు. హర్యానాలో మునుపటి అత్యధిక సింగిల్-డే స్పైక్ 2020 నవంబర్ 20 న నమోదైంది, ఇప్పుడు మరోమారు రాష్ట్రంలో 3,104 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 20,981 క్రియాశీల కేసులు ఉండగా, రికవరీ రేటు 92.35 శాతంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం తెలిపింది.