షీనాబోరా హత్యకేసు: మారియా బదలీ వెనుక అసలు కారణం ఇదా?
ముంబై: షీనాబోరా హత్యకేసుని దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీస్ కమిషనర్ రాకేష్ మారియాను బాధ్యతల నుంచి తప్పించడం వెనుక రాజకీయ కారణాలున్నాయనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి. పదోన్నతులలో భాగంగానే ఆయన బదిలీ జరిగిందంటూ మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇటీవల ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ షీనాబోరా హత్యకేసుపై అనవసరమైన శ్రద్ధ ఎందుకు కనబరుస్తున్నారంటూ పోలీసు ఉన్నతాధికారులను ప్రశ్నించినట్టు మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ఎన్నో కేసులు ఉండగా ఈ కేసుపైనే మారియా అత్యుత్సాహం ప్రదర్శించడంపై ఫడ్నవీస్ అసంతృప్తిగా వ్యక్తం చేశారని తెలుస్తోంది.
అందుకే ఆయనకు పదోన్నతి కల్పించి ఈ కేసు నుంచి పక్కకు తప్పించినట్లు ఊహాగానాలు వచ్చాయి. షీనా బోరా హత్యే కేసులో ఇంద్రాణి ముఖార్జియాను స్వయంగా రాకేష్ మారియానే విచారించారు. ఈ కేసుకు సంబంధించిన మారియానే ఎందుకు విచారణకు వెళ్లారని ప్రశ్నించగా, ఈ కేసు హై ప్రొఫైల్, సహకరించని మనస్తతత్వం ఉన్న ఇంద్రాణి హై ఫై ఇంగ్లీషులో మాట్లాడుతుండటమేనని మారియా సన్నిహితులు సమాధానమిస్తున్నారు.
అంతేకాదు సీనియారిటీలో భాగంగా రాకేష్ మారియాకు పదోన్నతి వస్తుందని ముందే తెలుసని అంటున్నారు సన్నిహితులు. కానీ, 22 రోజుల ముందుగానే ఆర్డర్లు వస్తాయని ఊహించని మారియా ఆశ్చర్యానికి గురవడమే కాకుండా, స్తబ్ధుడయ్యారనీ ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
సోమవారం నాడు జపాన్ వెళ్లే ముందు సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, రాకేష్ మారియా పదోన్నతి, బదిలీ ఫైల్పై సంతకం చేశారు. అయితే ఫడ్నవీస్, రాకేష్ మారియాకు మధ్య పెద్దగా సంబంధాలు లేవని సన్నిహితులు చెబుతున్నారు. గతంలో కూడా వీరిద్దరి మధ్య ఓ విషయంలో చిన్నపాటి వాదన జరిగిందని సమాచారం.
ముంబైలో రెస్టారెంట్లు, క్లబ్బులు, బార్లు రాత్రంతా తెరచి ఉంచాలని శివసేన యువనేత ఆదిత్య ఠాక్రే కోరగా అందుకు రాకేష్ మారియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే దీనికి బీజేపీ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. అంతేకాదు ఇటీవలే ఐపీఎల్ మాజీ చైర్మన్, మనీ ల్యాండరింగ్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోడీని మారియా కలవడంపై సమాధానం చెప్పాలని రాకేష్ మారియాను ఫడ్నవీస్ అడిగారు.
పై కారణాలే రాకేష్ మారియా పదోన్నతి, బదిలీకి కారణాలని తెలుస్తోంది.