బుద్ధి చూపిన చైనా: వాస్తవాధీన రేఖ వెంబడి దేప్సంగ్ ప్రాంతంలో భారీ నిర్మాణాలు, డ్రాగన్ బలగాలూ అక్కడే
లడఖ్: సరిహద్దులో బలగాల ఉపసంహరణకు అంగీకరించిన చైనా ఇప్పుడు మరో కుట్రకు తెరతీసినట్లు తెలుస్తోంది. భారత్-చైనా మధ్య ఉన్న వాస్తవాధీన రేఖ వెండి డ్రాగన్ దేశం పలు నిర్మాణాలు చేపడుతుండటం గమనార్హం. ఇందుకు సంబంధించిన చిత్రాలను సింథటిక్ అపర్చర్ రాడర్(ఎస్ఏఆర్) విడుదల చేసింది.
డీబీఓకు 24 కిలోమీటర్ల దూరంలోనే..
లడఖ్లోని దౌలెత్ బేగ్ ఓల్డీ(డీబీఓ)కు సుమారు 24 కిలోమీటర్ల దూరంలోని చైనా ఈ నిర్మాణాలను చేపడుతుండటం గమనార్హం. కొన్నేళ్ల క్రితం చైనా ఆక్రమించుకున్న అక్సాయిచిన్ ప్రాంతంలో డ్రాగన్ దేశం తమ బలగాలను అక్కడే ఉంచింది. 1962లో భారత్తో యుద్ధం తర్వాత ఈ ప్రాంతాన్ని చైనా అక్రమించుకున్న విషయం తెలిసిందే. ఆగస్టు 2020 తర్వాత నుంచి చైనా బలగాలు ఇక్కడ నిర్మాణాలను ఏర్పాటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
అమెరికా శాటిలైట్ చిత్రాలతో చైనా కుట్ర బట్టబయలు
గల్వాన్, ప్యాంగాంగ్ త్సో లేక్ ప్రాంతం నుంచి భారత్, చైనా బలగాలు ఉపసంహరించుకున్న తర్వాత డ్రాగన్ దేశం తమ బలగాలను ఇక్కడ తలదాచుకునేలా నిర్మాణాలు చేపట్టినట్లు తెలుస్తోంది. దేప్సంగ్ ప్రాంతంలో చైనా బలగాలు నిర్మాణాలు చేపట్టినట్లు ఈ చిత్రాలు వెల్లడిస్తున్నాయి. ఫిబ్రవరి 25న రాత్రి అమెరికాకు స్పేస్ సంస్థ క్యాపెల్లా స్పేస్కు చెందిన సార్ కమర్షియల్ శాటిలైట్ ఈ నిర్మాణాలకు సంబంధించిన ఫొటోలను తీసింది. ఇందుకు సంబంధించిన కథనాలను ఇండియాటుడే మొదటగా ప్రచురితం చేసింది. కాగా, దేప్సంగ్ ప్రాంతంలో చైనా బలగాల టియాన్వెండియన్ పోస్టులో డిఫెన్స్ సిస్టమ్స్, స్టోరేజీ, అడిషనల్ షెల్టర్స్, వాహనాలు, చైనా ఆర్మీ పీఎల్ఏ ఇక్కడ సకల ఏర్పాట్లు చేసుకుంది.
గల్వాన్ ఘటన తర్వాత నుంచే నిర్మాణాలు ప్రారంభించిన డ్రాగన్
గత జులైలో గాల్వాన్ ఘటన తర్వాత ఇక్కడ చైనా నిర్మాణాలను ప్రారంభించినట్లు తెలుస్తోంది. తాజా చిత్రాల్లో పలు భవనాలు, టవర్లు ఇక్కడ కనిపిస్తుండటం గమనార్హం. భారీ ఎత్తున చైనా సైనికులు ఇక్కడ బస చేస్తున్నట్లు తెలుస్తోంది. సరిహద్దులో శాంతి పరిస్థితులను కోరుకుంటున్నామంటూనే చైనా ఇలాంటి కుట్రలకు పాల్పడుతుండటం పలు అనుమాలకు తావిస్తోంది. తాజా పరిణామాలపై భారత్ ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటికే తమ భూభాగంలో అడుగు కూడా చైనాకు వదులుకోబోమని భారత్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని భారత రక్షణ దళాధినేతలు కూడా తేల్చి చెబుతున్నారు.