రిపబ్లిక్ డే ట్రాక్టర్ ర్యాలీ : పోలీసులపై తిరగబడ్డ రైతులు... తల్వార్లతో హల్చల్
దేశ రాజధాని ఢిల్లీలో రైతులు చేస్తున్న ట్రాక్టర్ ర్యాలీ ఉద్రిక్తతలకు దారితీసింది. పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఢిల్లీ అక్షరధామ్ సమీపంలో రైతులు-పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రోడ్డుకు అడ్డంగా ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించి రైతులు ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రైతులను చెదరగొట్టేందుకు లాఠీచార్జి జరిపిన పోలీసులు... వారిపై టియర్ గ్యాస్ను ప్రయోగించారు. పోలీసుల లాఠీచార్జితో రైతులు తల్వార్లు బయటకు తీసి తిరగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
ఘాజిపూర్ సరిహద్దులోని చింతామణి చౌక్ వద్ద కూడా పోలీసులు-రైతులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రైతులపై పోలీసులు లాఠీచార్జి జరిపారు. మరో ఘటనలో ఢిల్లీ-నోయిడా సరిహద్దులో ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు రైతులకు గాయాలయ్యాయి. మరోవైపు ట్రాక్టర్లతో ఎర్రకోట వద్దకు చేరుకున్న రైతులు... అక్కడి ప్రాకారంపై జెండా ఎగరవేశారు.సెంట్రల్ ఢిల్లీలోని ఐటీవో వద్దకు భారీ సంఖ్యలో ట్రాక్టర్లు చేరుకోవడంతో అక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్నిచోట్ల రైతులు ఉద్దేశపూర్వకంగానే పోలీసుల పైకి ట్రాక్టర్లతో దూసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొంటూ కొన్ని వీడియోలు ట్విట్టర్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఫోటోలు: గణతంత్ర దినోత్సవం రోజున ఉద్రిక్తంగా మారిన కిసాన్ ర్యాలీ
కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో గత రెండు నెలలుగా రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకూ రైతులతో కేంద్రం 11 దఫాలుగా జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ఏడాదిన్నర పాటు ఆ చట్టాలను పక్కనపెట్టేందుకు సిద్దమని ప్రభుత్వం ప్రకటించగా... రైతులు మాత్రం వాటి రద్దునే డిమాండ్ చేస్తున్నారు. చట్టాలను తాత్కాలికంగా పక్కనపెడుతామని చెప్పడం మోసపూరిత చర్యేనని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రిపబ్లిక్ డే సందర్భంగా రైతులు ట్రాక్టర్ ర్యాలీకి చేపట్టారు.