కుమారస్వామి కర్ణాటక సీఎం కావాలి: 11 ఏళ్లుగా వీరాభిమాని ఏం చేశాడంటే, హీరో నిఖిల్, కాశీ!
మైసూరు: కర్ఱాటక జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు హెచ్.డి.కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యే వరకు తాను తలనీలాలు, మీసాలు, గడ్డం తీయ్యనని ఆయన వీరాభిమాని, ఓ సామాన్య రైతు శపథం చేశారు. 11 ఏళ్ల తరువాత కర్ణాటక ముఖ్యమంత్రిగా హెచ్.డి. కుమారస్వామి ముఖ్యమంత్రి కావడంతో ఆయన వీరాభిమాని ఇప్పుడు కాశీలో మొక్కు తీర్చుకుంటున్నారు. కుమారస్వామి కుమారుడు హీరో నిఖిల్ గౌడ తన తండ్రి అభిమానిని కలిసి అభినందించాడు.
కుమారన్న వీరాభిమాని
మైసూరు జిల్లాలోని కేఆర్ నగర్ తాలుకా మేలూరు గ్రామంలో నివాసం ఉంటున్న రామకృష్ణ గౌడ హెచ్.డి. కుమారస్వామికి వీరాభిమాని. 2006 నుంచి 2007 వరకు 20 నెలలపాటు కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలు, రైతులకు ఎంతో న్యాయం జరిగిందని రామకృష్ణ గౌడ అభిప్రాయం.
కుమారస్వామి రాజీనామా
బీజేపీ-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్న కుమారస్వామి 2007లో జరిగిన పరిణామాలతో తన పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో కుమారస్వామి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు తాను మీసాలు, గడ్డం, తలనీలాలు తియ్యనని, ఆయన సీఎం అయిన తరువాత కాశీలో మొక్కు తీర్చుకుంటానని రామకృష్ణ గౌడ శపథం చేశారు.
11 ఏళ్లుగా శపథం
11 ఏళ్ల నుంచి రామకృష్ణ గౌడ తలనీలాలు, మీసం, గడ్డం తియ్యకుండా చెప్పిన మాట మీద నిలబడ్డారు. ఎట్టకేలకు జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి కుమారస్వామి సీఎం కావడంతో రామకృష్ణ గౌడ మొక్కు తీర్చుకుంటున్నారు.
హీరో నిఖిల్ గౌడ
కుమారస్వామి మీద ఉన్న అభిమానం తెలుసుకున్న మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ ఆరు నెలల క్రితం రామకృష్ణ గౌడను అభినందించారు. సీఎం కుమారస్వామి కుమారుడు. ప్రముఖ హీరో, జాగ్వార్ ఫేం నిఖిల్ గౌడ మైసూరు చేరుకుని ఓ ప్రైవేటు హోటల్ కు రామకృష్ణ గౌడను పిలిపించి అభినందించారు. రామకృష్ణ గౌడతో పాటు ఆయన కుమారుడు గౌతమ్ హీరో నిఖిల్ గౌడను కలిశారు.
కాశీకి రామకృష్ణ గౌడ
తన తండ్రి మీద ఉన్న అభిమానం గురించి తెలుసుకున్న హీరో నిఖిల్ గౌడ చలించిపోయారు. త్వరలో తన తండ్రి కుమారస్వామితో భేటీ కావడానికి ఏర్పాట్లు చేస్తానని రామకృష్ణ గౌడకు నిఖిల్ గౌడ హామీ ఇచ్చారు. నిఖిల్ గౌడతో భేటీ అనంతరం మొక్కు తీర్చుకోవడానికి రామకృష్ణ గౌడ కాశీకి బయలుదేరి వెళ్లారు.