లాక్డౌన్ ఎఫెక్ట్: మాజీ ముఖ్యమంత్రి తనయుడి వివాహం: విచారణకు ఆదేశించిన ప్రభుత్వం..
బెంగళూరు: మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవేగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారుస్వామి తనయుడు, నటుడు నిఖిల్ కుమారస్వామి వివాహం సాదాసీదాగా జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కర్ణాటక గృహ నిర్మాణశాఖ మంత్రి ఎం కృష్ణప్ప మనవరాలు రేవతిని ఆయన పెళ్లి చేసుకున్నారు. రామనగర జిల్లాలోని కేతగాన హళ్లిలో గల ఫామ్హౌస్లో అతి కొద్ది మంది అహూతుల సమక్షంలో ఈ వివాహాన్ని సాదాసీదాగా నిర్వహించారు.
Recommended Video
సాదాసీదాగా వివాహం
కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి లాక్డౌన్ అమలు చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో నిఖిల్ కుమారస్వామి వివాహాన్ని నిరాడంబరంగా జరిపించారు. ఈ పెళ్లి వేడుకలను రామనగర జిల్లాలోని పలు ప్రాంతాల్లో టీవీల్లో లైవ్ టెలికాస్ట్ చేసినట్లు తెలుస్తోంది. లాక్డౌన్ ఉన్నందు వల్ల ఈ వివాహానికి రాజకీయ రంగం నుంచి గానీ, కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి గానీ ఎవరూ హాజరు కాలేదు. వధూ,వరుల కుటుంబాలకు నుంచి కూడా అతి కొద్దిమంది మాత్రమే దీనికి హాజరయ్యారు.
అతి కొద్దిమంది సన్నిహితుల మధ్య..
కుమారస్వామి సోదరుడు మాజీమంత్రి హెచ్డీ రేవణ్ణ, ఆయన కుమారుడు, హసన్ లోక్సభ సభ్యుడు ప్రజ్వల్ రేవణ్ణ వంటి కొందరు ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. ఇదిలావుండగా.. లాక్డౌన్ కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వివాహాన్ని జరిపించడాన్ని నిబంధనలను ఉల్లంఘించినట్లుగా భావిస్తోంది కర్ణాటక ప్రభుత్వం. దీనిపై విచారణకు ఆదేశించింది. రామనగర జిల్లా డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్కు ఈ బాధ్యతలను అప్పగించింది.
విచారణకు ఆదేశించిన ప్రభుత్వం..
నిఖిల్ కుమారస్వామి వివాహంలో సోషల్ డిస్టెన్సింగ్ పాటించారా? లేదా? అనే విషయంపై ఆరా తీస్తామని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహించినట్టయితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి అశ్వత్ నారాయణ తెలిపారు. ఈ వివాహానికి సంబంధించిన పూర్తి నివేదికను అందజేయాలని రామనగర జిల్లా డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్కు ఆదేశించినట్లు చెప్పారు. వీడియోలను తెప్పించుకుని పరిశీలిస్తామని అన్నారు.
జాతకాల పట్ల నమ్మకం ఉండటం వల్ల.
లాక్డౌన్ అమల్లో ఉన్నందున.. ఈ పెళ్లిని వాయిదా వేయాలని మొదట్లో భావించినప్పటికీ.. అనంతరం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. సాధారణంగా దేవేగౌడ కుటుంబానికి దైవభక్తి అధికం. తరచూ హోమాలను జరుపుతుంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తుంటారు. జాతకాల పట్ల కూడా అంతే నమ్మకం ఉంది ఆయన కుటుంబ సభ్యులకు. జాతకం సరిపోవడం వల్ల ముందుగా నిర్ణయించిన సమయానికే వివాహాన్ని జరిపించారు.
60 నుంచి 70 మంది మాత్రమే..
తన కుమారుడి వివాహానికి పెద్ద సంఖ్యలో ఎవరూ హాజరు కాలేదని కుమారస్వామి చెబుతున్నారు. రెండు కుటుంబాల తరఫున 60 నుంచి 70 మంది మాత్రమే హాజరయ్యారని స్పష్టం చేశారు. బెంగళూరులో తాము నివాసం ఉంటున్న ఇంట్లో వివాహం జరిపించాలని మొదట నిర్ణయం తీసుకున్నామని, ఆ ప్రాంతం రెడ్జోన్లో ఉండటం వట్ల రామనగరలోని తమ ఫామ్హౌస్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు. ప్రభుత్వం విచారణకు సహకరిస్తామని చెప్పారు.
వివాహ సమయంలో మాస్కులు లేకుండా..
వివాహ సమయంలో వధూవరులు మొదలుకుని ఎవ్వరూ కూడా మాస్కులను ధరించకపోవడం కనిపించింది. సోషల్ డిస్టెన్సింగ్ను పాటించిన సందర్భం కూడా తక్కువేనని అంటున్నారు. మాస్కులు ధరించకపోవడం, ఇంట్లో నుంచి ఫామ్హౌస్ వరకూ ఎలా వెళ్లడం.. వంటి చర్యలు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించినట్లుగా భావిస్తోంది యడియూరప్ప సర్కార్. రామనగర పోలీసుల నుంచి నివేదిక అందిన తరువాత చర్యలపై దృష్టి సారిస్తామని అశ్వత్ నారాయణ చెప్పారు.