ఫరీదాబాద్ కాలేజీ విద్యార్థిని హత్య కేసులో ట్విస్ట్... తెర పైకి 'లవ్ జిహాదీ' కోణం...?
పట్టపగలు... కాలేజీ కాంపౌండ్ బయటే నికిత తోమర్(21) అనే విద్యార్థినిని గన్తో కాల్చి చంపిన ఘటన హర్యానాలో సంచలనం రేకెత్తిస్తోంది. ఫరీదాబాద్లోని బల్లబ్ఘర్లో ఉన్న ఓ కాలేజీలో అప్పుడే పరీక్ష రాసి బయటకొచ్చిన నికిత తోమర్ను... కారులో అక్కడికి వచ్చిన ఇద్దరు యువకులు బలవంతంగా లోపలికి ఎక్కించే ప్రయత్నం చేశారు. నికిత తోమర్ అందుకు నిరాకరించడంతో ఆ ఇద్దరిలో ఒక యువకుడు ఆమెపై కాల్పులకు పాల్పడ్డాడు. అనంతరం కారులో ఇద్దరు నిందితులు అక్కడినుంచి పారిపోయారు. అయితే ఈ ఘటనలో 'లవ్ జిహాదీ' ఆరోపణలు తెర పైకి రావడం తాజా ట్విస్ట్.
లవ్ జిహాదీ అంటున్న మృతురాలి కుటుంబం...
సోమవారం మధ్యాహ్నం 3.40గం. సమయంలో ఈ ఘటన జరగ్గా... అర్ధరాత్రి నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడిని తౌసిఫ్గా,మరో నిందితుడిని రెహాన్గా గుర్తించారు. ఈ ఇద్దరు హర్యానాలోని నుహ్ ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతున్న క్రమంలో మృతురాలి కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేశారు. 'లవ్ జిహాదీ' వల్లే తమ కుమార్తె చనిపోయిందని ఆరోపించారు. ముస్లిం వర్గానికి చెందిన తౌసిఫ్... మతం మార్చుకుని అతన్ని వివాహం చేసుకోవాల్సిందిగా మూడేళ్ల నుంచి నికితను వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించారు. అందుకు ఆమె నిరాకరిస్తుండటంతో చివరికిలా హత్యకు పాల్పడ్డారని పేర్కొన్నారు.
గతంలోనే తౌసిఫ్పై కేసు
తౌసిఫ్ వేధింపులపై 2018లోనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు నికిత తండ్రి తెలిపారు. తౌసిఫ్ తమ కుమార్తెను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆ ఫిర్యాదులో పేర్కొన్నట్లు చెప్పారు. అయితే కేసును ఉపసంహరించుకోవాల్సిందిగా తమ కుటుంబంపై తీవ్ర ఒత్తిడి రావడంతో వెనక్కి తగ్గాల్సి వచ్చిందన్నారు. కుటుంబ సభ్యులు చేసిన 'లవ్ జిహాద్' ఆరోపణలు ఇప్పుడు ప్రకంపనలు రేపుతున్నాయి.
ఇద్దరి మధ్య ప్రేమ...?
పోలీసుల కథనం ప్రకారం... నిజానికి నికిత,తౌసిఫ్ కొన్నాళ్లు ప్రేమించుకున్నారు. ఏమైందో తెలియదు కానీ నికిత కొద్దిరోజులుగా తౌసిఫ్తో మాట్లాడటం మానేసింది. అతని ఫోన్ నంబర్ను బ్లాక్ చేసింది. అప్పటినుంచి తౌసిఫ్ ఆమెపై ఆగ్రహంతో రగిలిపోతున్నాడు. సోమవారం(అక్టోబర్ 27) ఆమె పరీక్ష రాసేందుకు కాలేజీ వద్దకు వస్తుందని తెలిసి... స్నేహితుడు రెహాన్తో కలిసి అక్కడే మాటు వేశాడు. నికిత కాలేజీ నుంచి బయటకు రాగానే బలవంతంగా కారులో ఎక్కించే ప్రయత్నం చేశాడు. అందుకు ఆమె నిరాకరించడంతో పాయింట్ బ్లాక్లో తుపాకీతో కాల్చి చంపాడు.
Recommended Video
భగ్గుమన్న నిరసనలు...
ఈ కేసును స్థానిక పోలీసులు క్రైమ్ బ్రాంచ్కు అప్పగించారు. పోస్టుమార్టమ్ రిపోర్ట్ ఇంకా అందాల్సి ఉంది. మరోవైపు ఈ ఘటనను నిరసిస్తూ బల్లబ్ఘర్లో జనం పెద్ద ఎత్తున నిరసనలకు దిగుతున్నారు. నికిత్ తోమర్ హత్యకు గురైన అగర్వాల్ కాలేజీ ఎదుట ఆమె స్నేహితులు నిరసన ప్రదర్శన చేపట్టారు. నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. స్థానిక బీజేపీ నేత రమన్ మాలిక్ మాట్లాడుతూ... ఇది లవ్ జిహాదీ ఘటనే అని ఆరోపించారు. చాలా సందర్భాల్లో ఇలాంటి కేసుల్లో పోలీసులు బాధితుల పక్షాన నిలవట్లేదని ఆరోపించారు.