ఇన్ఫోసిస్లోకి నందన్ నీలేకని రీ ఎంట్రీ?: సంక్షోభంలో తెరవెనుక..
ఇన్ఫోసిస్లో వివాదం నేపథ్యంలో ఆ సంస్థ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని రంగంలోకి దిగారని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆయన తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.
బెంగళూరు: ఇన్ఫోసిస్లో వివాదం నేపథ్యంలో ఆ సంస్థ సహ వ్యవస్థాపకులు నందన్ నీలేకని రంగంలోకి దిగారని తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆయన తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.
అంతేకాదు, నందన్ నీలేకని ఇన్ఫోసిస్కు తిరిగి వచ్చే అవకాశాలున్నాయని, గతంలో ఆయన చేపట్టిన బాధ్యతలు మళ్లీ చేపట్టవచ్చునని అంటున్నారు. ఇన్ఫోసిస్ తొలి సీఈవో నారాయణ మూర్తికి నీలేకని మద్దతుగా ఉన్నారని తెలుస్తోంది.
సిక్కా రాజీనామాతో సంక్షోభం
విశాల్ సిక్కా రాజీనామాతో ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ సంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కంపెనీని గట్టెక్కించేందుకు ఆధార్ సృష్టికర్త, సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నిలేకని ఇన్ఫోసిస్లోకి పునరాగమనం చేయనున్నట్లు వార్తలు రావడం గమనార్హం.
Recommended Video
నందన్ నీలేకని బాధ్యతలపై 48 గంటల్లో స్పష్టత
అయితే నీలేకనికి ఇన్ఫోసిస్లో కచ్చితంగా ఏ బాధ్యతలు అప్పగిస్తారో తెలియరాలేదు. నందన్ నిలేకని తిరిగి రావడం, ఆయనకు అప్పగించే బాధ్యతలపై మరో 48 గంటల్లో స్పష్టత వచ్చే అవకాశముందని సమాచారం.
ఇన్పోసిస్ ఇన్వెస్టర్ల సమావేశం వాయిదా
మరోవైపు కంపెనీ సహవ్యవస్థాపకులు నారాయణమూర్తి ఇన్వెస్టర్లతో నిర్వహించనున్న సమావేశం వాయిదా పడింది. మూర్తి అనారోగ్య కారణాలరీత్యా బుధవారం సాయంత్రం 6.30 గంటలకు జరగాల్సిన సమావేశాన్ని ఈ నెల 29కి వాయిదా వేశారు.
మార్కెట్లో నందన్ నీలేకని ఉత్సాహం
ఈ నేపథ్యంలోనే నందన్ నిలేకని పునరాగమనంపై మీడియాలో వార్తలు వస్తుండటం గమనార్హం. నిలేకని ఇన్ఫోసిస్లోకి వస్తారన్న వార్తలు అటు స్టాక్మార్కెట్లో కూడా ఉత్సాహం నింపాయి. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఇన్ఫీ షేర్లు 2.8 శాతం లాభాలను నమోదు చేశాయి.
ఏడుగురు వ్యవస్థాపకుల్లో ఒకరు
ఆయన పునరాగమనం చేస్తే సానుకూల ఫలితాలు వస్తాయనడానికి ఇదే ఉదాహరణ అని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఇన్ఫోసిస్ను నెలకొల్పిన ఏడుగురు వ్యవస్థాపకుల్లో నిలేకని ఒకరు. ఈయన కంపెనీకి సీఈవోగా 2002 నుంచి 2007 వరకు బాధ్యతలు నిర్వహించారు. ఆధార్ కార్డు రూపకల్పన ప్రాజెక్టు హెడ్గా 2009లో బాధ్యతలు స్వీకరించి ఇన్ఫోసిస్ నుంచి తప్పుకున్నారు.