వీళ్ల పైశాచికం పాడుగానూ.. వేశ్యలపై గ్యాంగ్ రేప్
నోయిడా : దేశ రాజధానిలో దారుణం జరిగింది. ఢిల్లీలో సెక్స్ వర్కర్లపై జరిగిన సామూహిక అత్యాచార ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పడుపు వృత్తిని నమ్ముకుని పొట్టపోసుకుంటున్న ముగ్గురు వేశ్యలపై తొమ్మిది మంది వ్యక్తులు గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
మంగళవారం రాత్రి సమయంలో విటులను ఆకర్షించే క్రమంలో ముగ్గురు వేశ్యలు లజ్పత్ నగర్ మెట్రో రైల్వే స్టేషన్ సమీపంలో నిలబడి ఉన్నారు. అంతలో అటుగా వచ్చిన కారులో ఇద్దరు వ్యక్తులున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులతో ఒక రాత్రి గడపడానికి 3 వేల రూపాయల చొప్పున బేరం కుదుర్చుకున్నారు. ఆ మేరకు 3,600 రూపాయలు అడ్వాన్స్ కూడా ఇవ్వడంతో నమ్మకం కుదిరి ముగ్గురు వేశ్యలు అదే కారులో బయలుదేరారు.
కారులో వచ్చిన ఇద్దరు వ్యక్తులు నోయిడా సెక్టార్లోని 135 సర్వే నెంబర్లోని ఫామ్ హౌజ్కు తీసుకెళ్లారు. వారు వెళ్లే సమయానికి మరో ఏడుగురు వ్యక్తులు అక్కడకు చేరుకున్నారు. అయితే ఇద్దరు వ్యక్తులతో గడపడానికి మాత్రమే ఒప్పందం కుదుర్చుకోవడం.. తీరా అక్కడ మరో ఏడుగురు వ్యక్తులు కనిపించడంతో సెక్స్ వర్కర్లు నిరాకరించారు. అక్కడినుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. అయితే ఆ తొమ్మిది మంది వ్యక్తులు బలవంతంగా వారిపై అత్యాచారం చేయడంతో పాటు భౌతికంగా దాడి చేశారు.
మంగళవారం రాత్రి నుంచి బుధవారం తెల్లవారుజాము దాకా తొమ్మిది మంది వ్యక్తులు రాక్షస క్రీడ కొనసాగించారు. చివరకు అందులో ఒక వ్యక్తిని బతిమిలాడితే ఉదయం 5 గంటల సమయంలో ఆ ముగ్గురు వేశ్యలను మెయిన్ రోడ్డుమీద వదిలేశాడు. మొత్తానికి వారి నుంచి తప్పించుకోవడంతో బాధితులు 100 కు డయల్ చేసి జరిగిన విషయం వివరించారు. గ్యాంగ్ రేప్ చేయడమే గాకుండా వారి నుంచి నగదు కూడా తీసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా ఇద్దరికోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే నిందితులంతా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకడు మాత్రం క్యాబ్ డ్రైవర్గా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.