కేరళలో నిఫా ప్రమాద ఘంటికలు: అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ హెచ్చరిక!
Recommended Video
కోజికోడ్: నిఫా కారణంగా కేరళలో మృత్యువాత పడుతున్నవారి సంఖ్య పెరుగుతూనే ఉంది. గత రెండు రోజుల్లో మరో ఇద్దరు నిఫా కారణంగా మరణించడంతో మృతుల సంఖ్య 16కి చేరుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కెకె శైలజ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
మరీ ఆందోళన చెందాల్సిన అవసరం లేనప్పటికీ 'మనమంతా జాగ్రత్తగా ఉండాల్సిన తరుణం' అంటూ ఆమె కామెంట్ చేశారు. నిఫాను అరికట్టేందుకు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నిఫా అనుమానిత కేసులు, నిఫాతో బాధపడుతున్నవారి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపారు. సందర్భం వచ్చినప్పుడు టెస్టుల రిపోర్టులు బయటపెడుతామన్నారు.
కోజికోడ్ లో ఏర్పాటు చేసిన స్పెషల్ కంట్రోల్ రూమ్ కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు చెప్పారు. వైద్య సిబ్బంది సైతం జాగ్రత్తలు తీసుకోవాలసి సూచిస్తున్నారు. నిఫాతో ఇద్దరు పేషెంట్స్ చనిపోయిన ఆసుపత్రిలో.. నలుగురు డాక్టర్లు, నర్సులను వారం రోజులు లీవుపై పంపించారు.
నిఫాకు మరో ఇద్దరు బలి: కేరళలో 16కి చేరిన మృతుల సంఖ్య!..
కాగా, గురువారం నిఫాతో మృత్యువాతపడ్డ రేసిన్ మొదట బ్లాసరీ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. మొదట అతనికి నిఫా నెగటివ్ అని తేలినప్పటికీ.. ఆ తర్వాత లక్షణాలు బయటపడ్డాయి. ఆ తర్వాత ఆసుపత్రిలోనే అతను చనిపయాడు. అయితే అంతకుముందు ఆసుపత్రిలో చేరిన మరో పేషెంట్ నుంచే అతనికి ఆ వ్యాధి సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు.
కోజికోడ్ జిల్లా కోర్టు సూపరిండెంట్ కూడా నిఫా కారణంగా మృతి చెందడంతో కొద్దిరోజుల పాటు కోర్టు వ్యవహారాలను తాత్కాలికంగా నిలిపివేయాలని జిల్లా బార్ అసోసియేషన్ కు ఆదేశాలు వెలువడ్డాయి. వేసవి సెలవులు పూర్తయినప్పటికీ.. జూన్ 5నుంచి మాత్రమే స్కూల్స్ ఓపెన్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా అన్ని రాత పరీక్షలు, ఆన్ లైన్ పరీక్షలను జూన్ 16వ తేదీ దాకా వాయిదా వేసింది. ఇప్పటిదాకా మొత్తం 203 నిఫా అనుమానిత కేసులకు సంబంధించి బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ చేయగా.. అందులో 18పాజిటివ్ గా తేలాయి. ఆ 18మందిలో 16మంది ఇప్పటికే చనిపోయారు.