నిఫాకు మరో ఇద్దరు బలి: కేరళలో 16కి చేరిన మృతుల సంఖ్య!..
తిరువనంతపురం: కేరళలో నిఫా వైరస్ సోకి మరో ఇద్దరు మృత్యువాతపడ్డారు. కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మధుసూధనన్(56), అకిహిల్ కరసెరీ(28) నిఫా వైరస్ కారణంగా బుధవారం రాత్రి మృతిచెందారు. దీంతో నిఫా మృతుల సంఖ్య 16కి చేరుకుంది. మరో వ్యక్తికి సైతం నిఫా పాజిటివ్ గా తేలినట్టు కోజికోడ్ జిల్లా ఆరోగ్య అధికారి తెలిపారు.
Recommended Video
మొదట వాళ్లిద్దరూ కోలుకుంటున్నట్టే కనిపించినప్పటికీ.. ఆ తర్వాత పరిస్థితి విషమించిందని వైద్యాధికారి తెలిపారు. ఆసుపత్రిలోనే వారికి ఇన్ఫెక్షన్ సోకి ఉంటుందని చెప్పారు. తాజాగా ఆసుపత్రిలో చేరిన మరో వ్యక్తికి కూడా నిఫా పాజిటివ్ అని తేలడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.
ప్రస్తుతం ముగ్గురు వ్యక్తులకు నిఫా సోకిందని, మరో 9 మంది ఆ లక్షణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలుస్తోంది. ఇక నిఫా కారణంగా కోల్ కతాలో చనిపోయిన ఆర్మీ అధికారికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉందని రాష్ట్ర ఆరోగ్య డైరెక్టర్ డా.ఆర్ఎల్ సరిత తెలిపారు.
కాగా, చనిపోయిన ఆర్మీ అధికారి సీను ప్రసాద్(28).. విధుల్లో చేరడానికి ముందు నెల రోజులు లీవ్ పెట్టి కేరళలోని స్వగ్రామానికి వెళ్లినట్టు ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు. కోల్ కతాలోనే అతని అంత్యక్రియలు జరిగాయని, అతని బ్లడ్ శాంపిల్స్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పుణేకి పంపించామని తెలిపారు.
మరికొద్ది రోజుల్లో రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు రానుండటంతో వైద్యాధికారులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలు మొదలైతే వైరస్ మరింత వ్యాప్తి చెందుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.