వణికిస్తోన్న 'నిఫా' వైరస్: కేరళలో 15మంది మృతి!
న్యూఢిల్లీ: కేరళలో నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది. వైరస్ సోకిన 15మంది మృత్యువాత పడటంతో కేంద్రం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో జాతీయ వ్యాధి నియంత్రణ బృందాన్ని కేంద్రమంత్రి జేపీ నడ్డా కేరళకు వెళ్లాల్సిందిగా ఆదేశించారు.
కేంద్రమంత్రి ఆదేశాల మేరకు జాతీయ బృందం వెళ్లి అక్కడి పరిస్థితిపై సమీక్షించనుంది. 'కేరళలో నిఫా వైరస్ వ్యాప్తిపై సమీక్షపై నిర్వహించాం. జాతీయ వ్యాధి నివారణ బృందాన్ని అక్కడికి వెళ్లి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరాం.' అని జేపీ నడ్డా తెలిపారు.
నిఫా వైరస్ కారణంగా ఇప్పటికే ముగ్గురు మరణించడంతో కోజికోడ్ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మరో ఇద్దరికి కూడా ఈ వైరస్ సోకిందని, వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని గుర్తించారు.
కోజికోడ్ జిల్లాలో నిఫా వ్యాప్తి విషయాన్ని మొదట మాజీ కేంద్రమంత్రి ముల్లపల్లి రామచంద్రన్ కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.కుట్టియాడి, పెరంబర, పంచాయితీ పరిధుల్లో ఈ గుర్తు తెలియని వ్యాధితో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కేంద్రమంత్రి జేపీ నడ్డాకు ఆయన ఓ లేఖ రాశారు.
కొంతమంది దీన్ని నిఫా వైరస్ అంటున్నారని, మరికొంతమంది జూనోటిక్ అంటున్నారని, ఏదేమైనా వ్యాధి మాత్రం చాలా వేగంగా విస్తరిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం నిఫా వైరస్(ఎన్ఐవి) మనుషుల్లో తీవ్రమైన శ్వాసకోశ సమస్యలకు కారణమవుతుంది. కాగా, పందులు ఇతర జంతువుల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి జరుగుతుందని తెలుస్తోంది. ఇప్పటివరకు దీనికి ఎలాంటి వ్యాక్సిన్ లేకపోవడం గమనార్హం.