పిఎన్బీ స్కామ్: దిమ్మ తిరిగే నీరవ్ మోడీ ముంబై ఫ్లాట్ల ఖరీదు
ముంబై: పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం కేసులు నిందితుడు నీరవ్ మోడీ ముంబైలోని ఫ్లాట్ల విలువ తెలిస్తే దిమ్మ తిరుగుతుంది. కొద్ది రోజులుగా అటాచ్ చేసిన నీరవ్ మోడీకి చెందిన 29 ఆస్తుల విలువను అంచనా వేసే పనిలో ఆదాయం పన్ను శాఖ (ఐటి) శాఖ పడింది.
నీరవ్ మోడీ, ఆయన భార్య పేర్ల మీద ముంబైలోని వొర్లిలోని సముద్ర మహల్లో గల ఆరు ఫ్లాట్లు ఉన్నాయి. వాటి విలువ రూ.900 కోట్లు ఉంటుందని అంచనా. మొత్తం ఆస్తుల విలువ వేలాది కోట్లు ఉండే అవకాశం ఉంది.
ఏడు ఫ్లాట్లు ఇలా..
సముద్రానికి ఎదురుగా ముఖద్వారాలు ఉన్న ముంబైలోని ఆరు ఫ్లాట్లు నీరవ్ మోడీ, ఆయన భార్య అమీ మోడీ పేర్ల మీద సంయుక్తంగా రిజిస్టర్ అయి ఉన్నాయి. ఒక్కో ఫ్లాట్ ఖరీదు 150 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా.
ముంబైలో భార్యాభర్తలకు ఇల్లు
వారి ఇద్దరి పేరు మీద మంబైలోని పెద్దార్ రోడ్డులో ఇల్లు ఉంది. ఈడి అటాచ్ చేసిన ఆస్తుల్లో ఇది కూడా ఉంది. నీరవ్కు చెందిన పైర్స్టార్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్కు ముంబైలో 15 అత్యంత ఖరీదైన స్థిరాస్తులు ఉన్నాయి. వాటితో పాటు బాంద్రా కుర్ల కాంప్లెక్స్లో కమర్షియల్ ప్రాపర్టీ, ఒపెరా హౌస్లోని ప్రసాద్ చేంబర్స్లో ఫ్లాట్, ఫోర్ట్ ముంబైలోని కళా ఘోడాలో ఐటిటిఎస్ హౌస్ ఉన్నాయి.
అక్కడ కూడా ఓ ఇల్లు
కమలా మిల్స్ లోయర్ పరేల్లోని ట్రేడ్ పాయింట్లో ఓ ఫ్లోర్, అంధేరీలోని ఎంఐదడిసిలో ఆర్మీ నేవీ ప్రెస్ బిల్డింగ్ ఉన్నాయి. ఫైర్స్టార్కు ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీలో ఓ ఇల్లు కూడా ఉంది.
నీరవ్ మోడీ ట్రస్టుపై దృష్టి
నీరవ్ మోంటేక్రిస్టో ట్రస్ట్కు సంబంధించిన వివరాలను బహమాస్, సింగపూర్లోని అధికారులను, జెర్సీల్లోని అధికారుల నుంచి ఐటి శాఖ కోరింది. పన్ను ఎగవేతకు సంబంధించిన అనుమానాస్పద లావాదేవీల వివరాలను కూడా కోరింది.
విదేశీ లావాదేవీలపై విచారణ
రెండు లావాదేవీలపై ఆదాయం పన్ను శాఖ అధికారులు విచారణ జరుపుతున్నారు. వాటిలో ఒకటి సైప్రస్లోని జాడే బ్రిడ్డ్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి భారతదేశంలోని నీరవ్ మోడీకి చెందిన ఓ కంపెనీ పొందిన రూ.284 కోట్లు కాగా, రెండోది సింగపూర్కు చెందిన ఐస్లింగ్టన్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ నుంచి పొందిన 271 కోట్ల రూపాయలు.
సెజ్ల్లో ఆస్తులు
హదాస్పూర్, పూణేల్లో నీరవ్, అమీ పేర్ల మీద రెండు ఆస్తులు ఉన్నాయి. జైపూర్, సూరత్ల్లోని ప్రత్యేక ఆర్థిక మండళ్లలో (సెజ్ల్లో) ఫైర్స్టార్కు భారీ స్థలాలు ఉన్నాయి.. వాటికి తోడు ఈ నగరాల్లో ఇతర ఆస్తులు కూడా ఉన్నాయి.
చోక్సీ ఏడు ఆస్తులు జప్తు
ఐటి అధికారులు శనివారంనాడు మెహుల్ చోక్సీకి చెందిన ఏడు ఆస్టులను జప్తు చేసింది. మెహుల్ చోక్సీ నీరవ్ మోడీ వ్యాపార భాగస్వామి మాత్రమే కాకుండా మేనమామ కూడా. వాటిలో ముంబైలోని మూడు అతని పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నాయి. అవి వాకేశ్వర్లోని గోకుల్లో 9,10 ఫ్లోర్లు, వాదాలలోని స్ప్రింగ్ టవర్స్లో రెండు ఫ్లాట్స్.
ఖాతాల్లోంచి డబ్బులు తీసేశాడు
చోక్సీకి చెందిన ఇతర ఆస్తులు గీతాంజలి జెమ్స్ లిమిటెడ్, గిలీ ఇండియా లిమిటెడ్ కంపెనీల పేర్ల మీద రిజిస్టరయి ఉన్నాయి. చోక్సీకి చెందిన 9 ఖాతాలను, నీరవ్ మోడీ, ఆయన కంపెనీలకు చెందిన 105 ఖాతాలను ఐటి శాఖ జప్తు చేసింది. చోక్సీ చాలా ఖాతాల్లోంచి డబ్బులు తీసుకున్నాడు. అవి జీరో బ్యాలెన్స్ చూపిస్తున్నాయి.