లండన్లో రాజకీయ ఆశ్రయం కోసం నీరవ్ మోడీ యత్నాలు
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) కుంభకోణంలో రూ. 13వేలకోట్లకుపైగా మోసగించి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ ప్రస్తుతం లండన్లో తలదాచుకుంటున్నాడు. అయితే, ఆయన అక్కడే రాజకీయ ఆశ్రయం పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.
భారత్, బ్రిటిష్ అధికారులను ఉటంకిస్తూ ఓ మీడియాలో ఇందుకు సంబంధించిన వార్తలు వచ్చాయి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలను తెలిపేందుకు బ్రిటన్ హోంశాఖ అధికారులు నిరాకరించారు. వ్యక్తిగత కేసుల్లో సమాచారం పంచుకోలేమని స్పష్టం చేశారు. మరోవైపు మీడియాలో వచ్చిన వార్తలపై నీరవ్ మోడీ కూడా స్పందించలేదు.
పీఎన్బీలో నీరవ్ మోడీ, అతని మామ మెహుల్ చోక్సీలు కలిసి రూ.13,578 కోట్ల మోసానికి పాల్పడిన విషయం తెలిసిందే. మోసం వెలుగులోకి రాకముందే విదేశాలకు పారిపోయిన నీరవ్.. ప్రస్తుతం లండన్లో ఉంటూ అక్కడ పొలిటికల్ ప్రాసిక్యూషన్ పేరుతో ఆశ్రయం కోసం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
కాగా, పీఎన్బీ కేసులో నీరవ్, చోక్సీలతో కలిపి 25 మందిపై మే నెలలో సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇప్పటికే బ్యాంకులకు సుమారు 9వేల కోట్ల రుణాలు ఎగ్గొట్టిన మద్యం వ్యాపారి విజయ్ మాల్యా కూడా లండన్లోనే ఉంటున్న విషయం తెలిసిందే.