నీరవ్ మోడీకి షాక్: బీచ్కు ఎదురుగాఉన్న ఖరీదైన బంగ్లాను కూల్చివేయనున్న అధికారులు
బ్యాంకులకు కుచ్చుటోపీ వేసి విదేశాలకు పరారైన ఆర్థిక నేరగాడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి సంబంధించిన ఆస్తులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే మహారాష్ట్రలోని రాయగడ్ జిల్లాలో ఉన్న బీచ్ ప్రాంతంలోని అత్యంత విలాసవంతమైన భవనంను కూల్చేందుకు సిద్ధమయ్యారు అధికారులు. ఇప్పటికే ఆ భవంతిని కూల్చేందుకు కావాల్సిన మెషినరీని అక్కడకు చేర్చారు రాయిగడ్ సబ్ డివిజినల్ అధికారులు.
ఇక ఈ భవంతిని కూల్చేందుకు మొత్తంగా నాలుగు రోజుల సమయం పడుతుందని అధికారులు తెలిపారు. ఇప్పటికే ఈడీ ఆస్తుల స్వాధీనంలో భాగంగా కూల్చివేతకు కావాల్సిన అన్ని అనుమతి పత్రాలను రాయిగడ్ కలెక్టొరేట్లో సమర్పించింది. అంతకుముందు నీరవ్ మోడీకి చెందిన ఈ బంగ్లాను ఈడీ అటాచ్ చేసింది. బంగ్లాకు సంబంధించి అక్రమాలు కలెక్టర్ విచారణలో బయటపడటంతో ఈడీ దీన్ని అటాచ్ చేసింది.
అత్యంత విలాసవంతమైన ప్రాంతంలో 1.5 ఎకరాల్లో ఈ బంగ్లా ఉంది. 2004లో నీరవ్ మోడీ రూ.32 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇక్కడే తన ఖరీదైన వజ్రాలను తన క్లైంట్లకు ప్రదర్శనకు ఉంచుతాడు. అంతేకాదు కొన్ని పార్టీల కోసం కూడా ఈ ఫాంహౌజ్ను నీరవ్ మోడీ వినియోగిస్తారని తెలుస్తోంది. ముంబై నుంచి 100 కిలోమీటర్లు దూరంలో ఉన్న రాయగడ్ ప్రాంతంలో ఈ ఫాంహౌజ్ ఉంది. దీనిపక్కనే 12వేల చదరపు అడుగుల్లో విలాసవంతమైన బంగ్లా ఉంది. ఇందులో ఐదు బెడ్రూంలు, ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్, ఓ థియేటర్, లైబ్రరీ ఉన్నట్లు సమాచారం.