మామూలోడు కాదు: రద్దయిన పాస్ పోర్టు పైనే నాలుగు దేశాలను చుట్టేసిన నీరవ్ మోడీ
పంజాబ్ నేషనల్ బ్యాంకులో వేలకోట్ల స్కామ్ చేసి దేశం విడిచి పారిపోయిన ప్రముఖ పారిశ్రామికవేత్త నీరవ్ మోడీ.... రద్దయిన పాస్ పోర్ట్ మీదే నాలుగు సార్లు మూడుదేశాలకు ప్రయాణించినట్లు సీబీఐకి ఇంటర్పోల్ అధికారులు తెలిపారు. చివరిసారిగా ఆయన మార్చిలో జర్నీ చేసినట్లు గుర్తించారు. ఫిబ్రవరి 24న నీరవ్ మోడీకి సంబంధించిన పాస్పోర్టును భారత విదేశీవ్యవహారాల శాఖ రద్దు చేసింది.
నీరవ్ మోడీ మార్చి 15 నుంచి మార్చ్ 31 మధ్య అమెరికా, యూకే, హాంగ్కాంగ్ల మధ్య ప్రయాణించాడని తెలుపుతూ ఇంటర్ పోల్ అధికారులు సీబీఐకి జూన్ 5న రాసిన లేఖలో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 24న భారత విదేశీ వ్యవహారాల శాఖ నీరవ్ మోడీ పాస్పోర్టుతో సహా తన మామ మెహుల్ చోక్సీ పాస్ పోర్ట్ను కూడా రద్దు చేసింది.
అంతకుముందే అంటే పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణం వెలుగు చూడకముందే నీరవ్ మోడీ అతని భార్య అమి, సోదరుడు నిషీల్, మామ చోక్సీలు జనవరి మొదటి వారంలో దేశం విడిచి పారిపోయారు. ప్రస్తుతం నీరవ్ యూకేలో, చోక్సీ అమెరికాలో ఉన్నట్లు సమాచారం.మరోవైపు సింగపూర్ శాశ్వత పౌరుడిగా ఉండేందుకు నీరవ్ జనవరిలోనే దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే నీరవ్ మోడీపై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాల్సిందిగా సీబీఐ ఇంటర్ పోల్ను కోరింది. నీరవ్ మోడీ యూకేలోనే ఉన్నట్లు ఆ దేశ ప్రభుత్వం జూన్ 11న అధికారికంగా నిర్ధారించింది.