వేలానికి నీరవ్ మోడీ విలాసవంతమైన కార్లు... ఎంతకు అమ్ముడుపోయాయంటే..?
ముంబై: ప్రభుత్వం అధీనంలో నడిచే మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పోరేషన్ ఆర్థిక నేరగాళ్లు అయిన నీరవ్ మోడీ మెహుల్ చోక్సీలకు చెందిన 13 కార్లను వేలం వేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టొరేట్ నేతృత్వంలో జరిగిన వేలంపాటలో కార్లు మొత్తం రూ. 3.29 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఇందులో 11 కార్లు నీరవ్ మోడీకి చెందినవి కాగా రెండు కార్లు మెహుల్ చోక్సీకి చెందినవని ఈడీ పేర్కొంది.
మొత్తం 13 కార్లలో రెండు అతి ఖరీదైన రోల్స్రాయ్స్ , పోర్ష్ కంపెనీలకు చెందినవి. ఈ రెండు ఖరీదైన కార్లను కొనేందుకు బిడ్డర్లు ఆసక్తి చూపగా టొయోటా కారును బిడ్డర్లు కొనేందుకు ఆసక్తి చూపలేదు. ఇదిలా ఉంటే కార్లను వేలం పాట పాడే ముందు... ప్రారంభ ధరకు సంబంధించిన మొత్తంలో 5శాతం డబ్బులను ముందుగానే డిపాజిట్ చేశారు. ఇది వేలం పాట నిర్వహిస్తున్న మెటల్ స్క్రాప్ ట్రేడింగ్ కార్పొరేషన్ సంస్థ వెబ్సైట్లో నిబంధనలను పొందుపర్చింది.
ఇక మొత్తం కార్ల ప్రారంభ ధర మూడు కోట్ల కంటే కాస్త ఎక్కవగా ఉన్నట్లు తెలుస్తోంది. రోల్స్ రాయ్స్ ఘోష్ట్ కారు ప్రారంభ ధర రూ.133 కోట్లు ఉండగా... హోండా బ్రియో కారు ప్రారంభ ధర 2.38 లక్షలతో ప్రారంభమైంది. రోల్స్ రాయ్స్ ఘోష్ట్ ప్రారంభ ధర రూ.1.33కోట్లు ఉండగా బిడ్డింగ్ ధర కూడా అంతే ముగిసింది. ఇక పోర్ష్ కారు ప్రారంభధర రూ.54 లక్షల 60వేలు ఉండగా... బిడ్డింగ్ ధర కూడా అంతే మొత్తంతో ముగిసింది. అంటే ఈ కార్లను ఎక్కువ ధరకు కొనేందుకు బిడ్డర్లు ఆసక్తి చూపలేదు. ఇక మెర్సిడీజ్ బెంజ్ కారు బేస్ ధర రూ.37 కోట్ల 80 వేలుండగా వేలంపాటలో అది రూ.53 లక్షల 76వేలు పలికింది. ఇక టొయోటా ఇన్నోవా కారు ప్రారంభ ధర రూ. 10 లక్షల 50 వేలు ఉండగా... వేలంపాటలో 18 లక్షల 6వేల రూపాయలు పలికింది.