భారత అమ్ములపొదిలో సరికొత్త అస్త్రం: నిర్భయ్ క్షిపణి ప్రయోగం విజయవంతం
ఒడిషా: భారత రక్షణ శాఖ మరో విజయం సాధించింది. 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల లక్ష్యాన్ని చేధించగల సూపర్సానిక్ క్రూయిజ్ క్షిపణి నిర్భయ్ను విజయవంతంగా ప్రయోగించింది. ఒడిషా తీరంలో ఈ ప్రయోగం నిర్వహించింది భారత్. ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఇచ్చిన డిజైన్కు అనుగుణంగా ఈ క్షిపణిని తయారు చేశారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్భయ్ క్షిపణిని రూపొందించడం విశేషం.
బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ (ఏడీఈ) సంస్థ సుదీర్ఘ లక్ష్యాలను చేధించగల ఈ క్షిపణిని రూపొందించింది. డీఆర్డీఓ ఆధ్వర్యంలో దీన్ని తయారు చేయడం జరిగింది. అణ్వాయుధాలు మోసుకెళ్లగలిగేలా దీన్ని డిజైన్ చేశారు శాస్త్రవేత్తలు. మొత్తం 300 కిలోల పేలుడు పదార్థాలను నిర్భయ్ మోసుకెళ్లగలదు. అంతేకాదు భూమిపై 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం చేధించగలదు. కావాల్సిన వేగాన్ని, ఎత్తును అందుకునేందుకు వీలుగా ఇందులో రాకెట్ బూస్టర్ను అమర్చారు.
క్షిపణి ఎంత ఎత్తులో ఎగురుతుందో తెలిపేందుకు రేడియో ఆల్టిమీటర్ను ఉపయోగించారు. ఇక క్షిపణి గమనాన్ని తెలుసుకునేందుకు ఇనర్షియల్ నావిగేషన్ వ్యవస్థను అమర్చారు. ఈ క్షిపణి బరువు మొత్తం 1500 కేజీలు ఉండగా... దీని వెడల్పు 0.52 మీటర్లుగా ఉంది. ఇక దీని రెక్కలు వెడల్పు 2.7 మీటర్లుగా ఉంది. లక్ష్యాల చేధనకు అనుగుణంగా 24 రకాల పేలుడు పదార్థాలను మోసుకెళ్లగలదు.అంతేకాదు శత్రుదేశాలు గుర్తుపట్టకుండా తక్కువ ఎత్తులో కూడా పయనించగలవు. వివిధ రకాల లక్ష్యాల మధ్య అసలైన లక్ష్యాన్ని చేధించగల సత్తా నిర్భయ్ క్షిపణికి ఉన్నట్లు అధికారులు తెలిపారు.