మహిళలను కించపరుస్తారా?: నిర్భయ డిఫెన్స్ లాయర్లకు షోకాజ్ నోటీసులు
న్యూఢిల్లీ: నిర్భయ ఘటనపై న్యాయస్థానంలో వాదనలు వినిపిస్తున్న డిఫెన్స్ న్యాయవాదులకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. నిర్భయ ఉదంతంపై ఇంగ్లీష్ ఫిల్మ్ మేకర్ రూపొందించిన ‘ఇండియాస్ డాటర్' డాక్యుమెంటరీలో డిఫెన్స్ లాయర్లు మహిళలకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బిసిఐ) నోటీసులు జారీ చేసింది.
డాక్యుమెంటరీలో డిఫెన్స్ న్యాయవాదులు ఎంఎల్ శర్మ, ఏపి సింగ్లు చేసిన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని బార్ కౌన్సిల్ పేర్కొంది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఇద్దరు న్యాయవాదులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామని బిసిఐ ఛైర్మన్ మనన్ కుమార్ మిశ్రా తెలిపారు.
కాగా, నిర్భయ కేసులో దోషుల తరపున వాదించిన ఎంఎల్ శర్మ, ఏపి సింగ్లు.. మహిళలను కుక్కలతోపాటు పోలుస్తూ వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారం రేపింది. దీనిపై మహిళా సంఘాలు, న్యాయ నిపుణులు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా స్పందించారు. ఆ లాయర్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా బార్ కౌన్సిల్ను కోరిన నేపథ్యంలో నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది.