నిర్భయ కేసులో అనూహ్య మలుపు: సుప్రీంలో మరో పిటీషన్.. ఈ సారి పవన్..!
న్యూఢిల్లీ: పారా మెడికల్ విద్యార్థిని నిర్భయపై చోటు చేసుకున్న సామూహిక అత్యాచారం కేసు.. శుక్రవారం మరో అనూహ్య మలుపు తీసుకుంది. ఈ కేసులో ఉరిశిక్షను ఎదుర్కొంటున్న పవన్ కుమార్ గుప్తా.. మరోసారి దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఢిల్లీ న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పవన్ తరఫు న్యాయవాది ఏపీ సింగ్ సుప్రీంకోర్టులో పిటీషన్ను దాఖలు చేశారు. ఈ పిటీషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.
వినయ్ శర్మ బాటలో పవన్ గుప్తా..
సంఘటన చోటు చేసుకున్న 2012 డిసెంబర్ 16వ తేదీ నాటికి తాను ఇంకా మైనర్నని, దీనికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నింటినీ ఢిల్లీ న్యాయస్థానానికి అందజేసినప్పటికీ.. దాన్ని పరిగణనలోకి తీసుకోలేదనేది పవన్ కుమార్ గుప్తా తరఫు న్యాయవాది వాదన.
ఇవే అంశాలను పొందుపరుస్తూ తాను సుప్రీంకోర్టులో పిటీషన్ను దాఖలు చేసినట్లు వెల్లడించారు. తాము సమర్పించిన సాక్ష్యాధారాలను ఏవీ పరిశీలించకుండా, కనీసం పరిగణనలోకి కూడా తీసుకోకుండా ఢిల్లీ న్యాయస్థానం డెత్ వారెంట్ను జారీ చేసిందని పేర్కొన్నారు. ఇదే అంశం మీద ఇదివరకు మరో దోషి వినయ్ కుమార్ శర్మ కూడా పిటీషన్ దాఖలు చేయగా.. దాన్ని ఢిల్లీ న్యాయస్థానం కొట్టి వేసింది.
కొత్త డెత్ వారెంట్ కోసం
నిర్భయ కేసులో తనకు క్షమాభిక్ష ప్రసాదించాలంటూ ముఖేశ్ కుమార్ సింగ్ పెట్టుకున్న పిటీషన్ను రాష్ట్రపతి రామ్నాథ్ సింగ్ కూడా తోసి పుచ్చారు. రాష్ట్రపతి భవన్ నుంచి ఈ పిటీషన్ కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు అందింది. ఆ శాఖ అధికారులు దీన్ని ఢిల్లీ ప్రభుత్వానికి పంపించారు. ఫలితంగా- కొత్త డెత్ వారెంట్ను జారీ చేయాలని అభ్యర్థిస్తూ ఢిల్లీ ప్రభుత్వం తరఫున న్యాయవాది పటియాలా హౌస్ న్యాయస్థానంలో పిటీషన్ను దాఖలు చేశారు. ఈ పిటీషన్ విచారణకు రావాల్సి ఉంది.