Nirbhaya Case:ఆత్మహత్యాయత్నం చేసిన నిందితుడు వినయ్ శర్మ..ఏం చేశాడంటే..?
Recommended Video
న్యూఢిల్లీ: 2012లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ ఘటనలో నిందితుల్లో ఒకడైన వినయ్ శర్మ జైలు గదిలో ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. తను ఉంటున్న జైలు గదిలోని గోడలకు తన తలను బాదుకున్నాడు. ఇలా బాదుకుంటుండగా గమనించిన జైలు సిబ్బంది వెంటనే అతన్ని నిలువరించారు. అప్పటికే రక్తమోడుతూ కనిపించిన వినయ్ శర్మకు చికిత్స అందించారు. ఫిబ్రవరి 16న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నిర్భయ నిందితులను మరికొద్దిరోజుల్లో ఉరితీయనుండగా... తన జైలు గదిలోని గోడకు వినయ్ శర్మ తలను బాదుకున్నట్లు జైలు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే గత కొన్ని రోజులుగా వినయ్ శర్మ ఆహారం తీసుకోకుండా నిరసన తెలుపుతున్నట్లు అతని తరపున లాయర్ చెప్పారు. అంతేకాదు జైలులో ఉన్న వినయ్ శర్మపై అధికారులు దాష్టీకం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే అధికారులే వినయ్ శర్మ తలను గోడలకు బాది ఉంటారన్న అనుమానం వ్యక్తం చేశారు. వినయ్ శర్మ మానసిక పరిస్థితి సరిగ్గా లేనందుకు ఉరిశిక్షను అమలు చేయరాదని చెప్పారు. దీంతో వినయ్ శర్మ ఆరోగ్యంపై సరియైన జాగ్రత్తలు తీసుకుని అతన్ని ఓ కంట కనిపెట్టి ఉండాలని కోర్టు తీహార్ జైలు సూపరింటెండెంట్కు సూచించింది.
నిర్భయ ఘటన నిందితులకు మార్చి 3వ తేదీన ఉరిశిక్షను అమలు చేయాలని ఢిల్లీ కోర్టు సోమవారం రోజున డెత్ వారెంట్ను జారీ చేసింది. ఇప్పటికే పలుమార్లు ఉరిశిక్ష తేదీ వాయిదా పడుతూ వస్తోంది. ఇక దోషులకు ఉరిశిక్ష మళ్లీ వాయిదా పడటమంటే అది బాధితురాలకు అన్యాయం జరిగినట్లే అవుతుందని కోర్టు అభిప్రాయపడింది. ముఖేష్ కుమార్, పవన్ గుప్తా, వినయ్ కుమార్ శర్మ, అక్షయ్ కుమార్లను మార్చి 3వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరి తీయాలని వారు మృతిచెందేవరకు వేచి చూడాలని కోర్టు తన ఆదేశాల్లో పేర్కొంది. కోర్టు నిర్భయ దోషులకు డెత్ వారెంట్ జారీ చేయడం ఇది మూడో సారి కావడం విశేషం.