నిర్భయ కేసులో తెర పైకి ఊహించని ట్విస్ట్ : అక్షయ్ ఠాకూర్ భార్య కొత్త డిమాండ్..
దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున నిర్భయ హత్యాచార ఘటన జరిగి ఏడేళ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ దోషులకు ఉరిశిక్ష పడని వైనం కళ్లముందు కనిపిస్తూనే ఉంది. ఇప్పటికే మూడుసార్లు ఉరిశిక్ష వాయిదాపడ్డ ఈ కేసులో.. నాలుగో డెత్ వారెంట్ తేదీ కూడా దగ్గరపడుతోంది. ఇలాంటి తరుణంలో కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. దోషుల్లో ఒకరైన అక్షయ్ ఠాకూర్ భార్య తన భర్త నుంచి విడాకులు కోరుతూ బీహార్లోని ఔరంగాబాద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఉరిశిక్ష వాయిదా వేయడం కోసమే ఈ కొత్త ఎత్తుగడను తెరపైకి తీసుకొచ్చారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పిటిషన్లో ఏం చెప్పారు..
'నిర్భయ కేసులో నా భర్తను దోషిగా ఉన్నాడు. కానీ అతను అమాయకుడు. మార్చి 20న అతన్ని ఉరితీయబోతున్నారు. ఆ తర్వాత భర్త లేని విధవరాలిగా నేను ఉండదలుచుకోలేదు. కాబట్టి చట్ట ప్రకారం నాకు నా భర్త నుంచి విడాకులు కావాలి.' అని అక్షయ్ భార్య పునీతా దేవి ఔరంగాబాద్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను విచారణకు స్వీకరించిన కోర్టు మార్చి 19న దీనిపై వాదనలు విననుంది.
పునీతా దేవి న్యాయవాది ఏమంటున్నారు
'హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 13(2)(II) ప్రకారం నా క్లైంట్ పునీతా దేవికి తన భర్త నుంచి విడాకులు పొందే హక్కు ఉంది. ఈ సెక్షన్ ప్రకారం భర్త ఏదైనా అత్యాచార కేసులో దోషిగా తేలితే అతని నుంచి విడాకులు కోరవచ్చు. ఈ మేరకు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాం.' అని పునీతా దేవి తరుపు న్యాయవాది ముకేష్ కుమార్ సింగ్ తెలిపారు. పునీతా దేవికి ఒక కొడుకు కూడా ఉన్నారని.. ఇప్పుడతని బాధ్యత ఆమె పైనే ఉందని చెప్పారు. మరోవైపు పునీతా దేవి బుధవారం(మార్చి 18)న ఢిల్లీకి వెళ్తున్నారని ఆమె బంధువు ఒకరు తెలిపారు. అక్షయ్ నుంచి తాను విడాకులు కోరుతూ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో.. విడాకులు మంజూరయ్యేంతవరకు అతనికి ఉరిశిక్ష వాయిదా వేయాలని ఆమె ఢిల్లీ పటియాలా కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది.
శిక్ష వాయిదా వేసేందుకేనా..
పునీతా దేవి విడాకుల పిటిషన్పై స్పందించిన కొంతమంది న్యాయవాదులు.. ఉరిశిక్షను వాయిదా వేసేందుకే ఈ ఎత్తుగడను తెర పైకి తీసుకొచ్చారని అభిప్రాయపడ్డారు. ముకేష్ సింగ్ దోషిగా తేలిన ఇన్నేళ్ల తర్వాత ఆమె విడాకుల కోసం ఇప్పుడు పిటిషన్ దాఖలు చేయడంలో ఆంతర్యం అదే అన్నారు. అయితే అదే సమయంలో ప్రతీ ఒక్కరికి తమ న్యాయ అవకాశాలను వినియోగించుకునే హక్కు ఉంటుందని గుర్తుచేశారు. పునీతా దేవీ పిటిషన్పై కొంతమంది జర్నలిస్టులు బీహార్లోని అక్షయ్ స్వగ్రామం లహంగ్కర్మలో వాకబు చేయగా.. గ్రామస్తులు తమకేమీ తెలియదన్నారు. కేసుకు సంబంధించి ఆ కుటుంబం ఎవరితోనూ ఏమీ చెప్పట్లేదన్నారు.
Recommended Video
రెండోసారి అక్షయ్ క్షమాభిక్ష పిటిషన్.. ఇప్పటికే కోర్టులో ముకేష్ పిటిషన్...
ప్రస్తుతం నిర్భయ దోషులైన నలుగురు అక్షయ్ ఠాకూర్,పవన్ గుప్తా,ముకేష్ కుమార్ సింగ్,వినయ్ శర్మ.. ఈ నలుగురు తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. మార్చి 20న వీరికి ఉరిశిక్ష విధించాల్సి ఉంది. గడువు దగ్గరపడుతుండటంతో దోషులు మరోసారి శిక్ష వాయిదాకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.నిర్భయ కేసులో నలుగురు దోషుల్లో ఒకడైన ముకేశ్ సింగ్ తాజాగా ఢిల్లీ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశాడు. నిర్భయ అత్యాచార ఘటన జరిగిన డిసెంబర్ 16, 2012లో తాను ఢిల్లీలోనే లేనని పిటిషన్లో పేర్కొన్నాడు. డిసెంబర్ 17, 2012న రాజస్థాన్ నుంచి పోలీసులు తనని ఢిల్లీ తీసుకొచ్చారని చెప్పుకొచ్చాడు. కాబట్టి తనకు విధించిన మరణశిక్షను రద్దు చేయాలని ముకేశ్ సింగ్ తన పిటిషన్లో కోరాడు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్లో పెట్టింది.
మరోవైపు మరో దోషి అక్షయ్ ఠాకూర్ రెండోసారి రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్కు క్షమాభిక్ష కోసం దరఖాస్తు చేసుకోబోతున్నాడు. ఈ మేరకు అతను రాసిన క్షమాభిక్ష పిటిషన్ తీహార్ జైలు అధికారులకు అందింది. ఢిల్లీ ప్రభుత్వం ద్వారా జైలు అధికారులు దాన్ని రాష్ట్రపతికి పంపించనున్నారు. ఇప్పటికే ఒకసారి రాష్ట్రపతి అతని క్షమాభిక్షను తిరస్కరించిన సంగతి తెలిసిందే.