Nirbhaya case: నేను అప్పుడు ఢిల్లీలోనే లేను, నాకు ఉరి ఎలా?: నిర్భయ దోషి పిటిషన్
న్యూఢిల్లీ: నిర్భయపై సామూహిక అత్యాచారం, దారుణ హత్యకు పాల్పడిన దుర్మార్గులు.. ఇప్పుడు శిక్షను తప్పించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నేరం చేసినప్పుడు లేని భయం.. శిక్ష అనుభవించేందుకు మాత్రం కలుగుతోంది ఆ కామాంధులకు. తమకు విధించిన మరణశిక్షను తప్పించుకునేందుకు సరికొత్త దారులు వెదుకుతున్నారు.
నేను ఢిల్లీలోనే లేను.. తీర్పు రిజర్వు
తాజాగా, నిర్భయ కేసులో నలుగురు దోషుల్లో ఒకడైన ముకేశ్ సింగ్ తాజాగా ఢిల్లీ కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశాడు. నిర్భయ అత్యాచార ఘటన జరిగిన డిసెంబర్ 16, 2012లో తాను ఢిల్లీలోనే లేనని పిటిషన్లో పేర్కొన్నాడు. డిసెంబర్ 17, 2012న రాజస్థాన్ నుంచి పోలీసులు తనని ఢిల్లీ తీసుకొచ్చారని చెప్పుకొచ్చాడు. అంతేగాక, తనను తీహార్ జైలులో చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించాడు.
నిర్భయ దోషులకు మార్చి 20న ఉరి
ఈ క్రమంలో తనకు విధించిన మరణశిక్షను రద్దు చేయాలని ముకేశ్ సింగ్ తన పిటిషన్లో కోరాడు. ఈ మేరకు ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జీ జస్టిస్ ధర్మేంద్ర రాణా ముందు తన పిటిషన్ ఉంచాడు. కాగా, ముకేష్ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు తీర్పును రిజర్వులో ఉంచింది. నిర్భయ దోషులను మార్చి 20న తెల్లవారుజామున 5.30గంటలకు ఉరితీయాలని మార్చి 5న ఢిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఉరిని తప్పించుకునేందుకు...
మరణశిక్ష అమలు వాయిదా వేసేందుకు నిర్భయ దోషులు ముకేశ్ సింగ్(32), వినయ్ శర్మ(26), అక్షయ్ ఠాకూర్(31), పవన్ గుప్తా(25) ఇప్పటికే చేయని ప్రయత్నం లేదు. న్యాయపరమైన అవకాశాల పేరిట ఉరిని తప్పించుకునేందుకు ఉన్న ఛాన్సులన్నీ వాడుకున్నారు. ఆ తర్వాత మరణశిక్ష ఖాయం కావడంతో తమకు న్యాయపరమైన అవకాశాలను పునరుద్ధరించాలంటూ సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారు. అయితే కోర్టు తిరస్కరించింది.
Recommended Video
అంతర్జాతీయ కోర్టులో కూడా..
ఇప్పటికే మూడుసార్లు ఉరిశిక్ష అమలును నిర్భయ దోషులు వాయిదా వేయించారు. న్యాయపరమైన అవకాశాలు కూడా లేకపోవడంతో మార్చి 20న ఈ దుర్మార్గులకు ఉరిఖాయమవుతుందన్న తరుణంలో మరోసారి ఇలాంటి పిటిషన్లు వేస్తూ శిక్షను తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటీవల అంతర్జాతీయ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు. తమకు విధించిన మరణశిక్షను రద్దు చేయాలని కోరుతూ అంతర్జాతీయ కోర్టులో నిర్భయ దోషుల తరపున న్యాయవాది ఏపీసింగ్ పిటిషన్ దాఖలు చేయడం గమనార్హం.