Nirbhaya Case:నిందితులను ఉరితీసేందుకు తీహార్ జైలుకు చేరుకున్న తలారీ పవన్ జల్లాద్
న్యూఢిల్లీ: నిర్భయ నిందితులను శనివారం ఉదయం తీహార్ జైలులో ఉదయం 6 గంటలకు ఉరితీయనున్నారు. అయితే కొన్ని రోజుల క్రితం ఉరితీసేందుకు తలారి దొరకలేదు. ఈ క్రమంలోనే ఈ దుర్మార్గులను ఉరి తీసేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటే మేము సిద్ధంగా ఉన్నామంటూ దేశవ్యాప్తంగా కొందరు తీహార్ జైలు అధికారులకు లేఖ రాశారు. అంతేకాదు విదేశాల నుంచి సైతం లేఖలు వచ్చాయని తీహార్ జైలు అధికారులు తెలిపారు. అయితే చివరిగా తీహార్ జైలు అధికారులు నిర్భయ కేసులో నిందితునలు ఉరి తీసేందుకు పవన్ జల్లాద్ అనే వ్యక్తిని ఎంపిక చేశారు.
తీహార్ జైలుకు చేరుకున్న తలారీ పవన్ జల్లాద్
నిర్భయ కేసులో నిందితులను ఉరితీసేందుకు పవన్ జల్లాద్ తీహార్ జైలుకు చేరుకున్నాడు. ముందుగా ట్రయల్ నిర్వహించనున్నాడు. డమ్మీలను ఉరికంబం వద్ద ఉంచి ట్రయల్ నిర్వహించనున్నాడు. నిర్భయ నిందితులను ఉరి తీసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు గతనెలలో తీహార్ జైలు అధికారులకు చెప్పాడు. నిర్భయ నిందితులను ఉరితీసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు పవన్ జల్లాద్ చెప్పాడు. అంతేకాదు నిందితులను ఉరితీస్తేనే తన కూతురు ఆత్మకు శాంతి కలుగుతుందని చెబుతున్న నిర్భయ తల్లిదండ్రులకు కూడా స్వాంతన లభిస్తుందని జల్లాద్ చెప్పారు. ఓ అమాయకురాలి జీవితాన్ని నాశనం చేసి ఆ తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చిన వారికి ఉరే సరైనదని పవన్ జల్లాద్ అన్నారు.
ఇదీ పవన్ జల్లాద్ నేపథ్యం
ఉత్తర్ ప్రదేశ్కు చెందిన పవన్ జల్లాద్ తండ్రి తాతలు కూడా నిందితులకు కోర్టులు విధించిన ఉరిశిక్షను అమలు చేశారు. పవన్ జల్లాద్ కూడా ఆ కుటుంబం నుంచి వచ్చినందునే అతని వైపు మొగ్గు చూపినట్లు తీహార్ జైలు అధికారులు తెలిపారు. అంతేకాదు అదే వృత్తిలో ఉన్నాడు కాబట్టి పొరపాట్లు జరగవని చెబుతున్నారు. ఇక ఉరితీసే తలారి శారీరకంగా మానసికంగా ధృడంగా ఉండటంతో పాటు కనుచూపు కూడా బాగుండాలనే నిబంధనలు ఉన్నాయి. పవన్ శారీరకంగాను, మానసికంగాను బలంగా ఉండటంతో పాటుగా కనుచూపు కూడా బాగుందని జైలు అధికారులు తెలిపారు.
2012లో అత్యంత పాశవికంగా...
ఇదిలా ఉంటే నిర్భయ కేసులో నిందితులుగా ఉన్న నలుగురికి తాజాగా డెత్ వారెంట్ జారీ చేసింది ఢిల్లీ కోర్టు. వినయ్, అక్షయ్, పవన్, ముఖేష్లకు ఉరిశిక్ష విధించింది ఢిల్లీ కోర్టు. 2012లో డిసెంబర్ 16న ఢిల్లీలో 23 ఏళ్ల నిర్భయపై కదులుతున్న బస్సులో ఈ నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిర్భయ కన్నుమూసింది. మొత్తం ఆరుగురు సామూహిక అత్యాచారం చేయగా ఇందులో ప్రధాన నిందితుడు రాంసింగ్ జైలులో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరొకరు మైనర్గా ఉండటంతో మూడేళ్లు జువైనైల్ జైలులో శిక్ష అనుభవించి విడుదలయ్యాడు.