నిర్భయ దోషి పవన్ కుమార్ గుప్తాకు సుప్రీంకోర్టులో చుక్కెదురు, క్యురేటివ్ పిటిషన్ తోసిపుచ్చిన ధర్మాసనం
నిర్భయ దోషి పవన్ కుమార్ గుప్తాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఉరిశిక్షపై సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ధర్మాసనం తోసిపుచ్చింది. నిర్భయపై లైంగికదాడి జరిగిన సమయంలో తాను మైనర్ అని పవన్ గుప్తా పేర్కొన్నారు. కానీ దీనిని కింది కోర్టులు విస్మరించాయని సర్వోన్నత ధర్మాసనం దృష్టికి ఆయన తరఫు న్యాయవాది తీసుకెళ్లారు. దీంతో పవన్కు విధించిన ఉరిశిక్షను జీవిత ఖైదుగా మార్చాలని సూచించారు.
తోసిపుచ్చిన ధర్మాసనం
నిర్భయ కేసులో ఉరిశిక్షపై పవన్ కుమార్ గుప్తా రివ్యూ పిటిషన్ కూడా ఫైల్ చేశాడు. అయితే సర్వోన్నత ధర్మాసనం అతని అప్పీల్ను కొట్టివేసింది. పవన్ కుమార్ గుప్తా దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్ను గురువారం ఆరుగురు సభ్యులు గల ధర్మాసనం విచారించి.. అతని అభ్యర్థనను తోసిపుచ్చింది. 2012 డిసెంబర్ 16వ తేదీన నిర్బయ ఘటన జరగగా.. మరుసటి ఏడాది పవన్ కుమార్ గుప్తా, మరో దోసి వినయ్ శర్మతో కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. 2018 జూలైలో పిటిషన్ విచారణకు వచ్చింది. అప్పుడు కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది.
కోర్టల్లో పిటిషన్లు
ఇక అప్పటినుంచి నేరం నుంచి తప్పించుకునేందుకు ఉన్న న్యాయ ప్రక్రియను అనుసరిస్తూనే ఉన్నారు. లెప్టినెంట్ గవర్నర్, రాష్ట్రపతి కూడా ఉరిశిక్షపై క్షమాభిక్ష ఇచ్చేందుకు నిరాకరించగా.. సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు, క్యురేటివ్ పిటిషన్లు వేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు దోషుల ఉరిశిక్ష వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ నెల 5వ తేదీన పాటియాలా హౌస్ కోర్టు డెత్ వారెంట్ ఇచ్చింది. 20వ తేదీ ఉదయం 6 గంటలకు దోషులను ఉరితీయనున్నారు. దీంతో తమకు ఉన్న అన్ని అవకాశాలను వారు వినియోగించుకుంటున్నారు. మరోవైపు దోషుల ఉరిశిక్ష ఆలస్యమవడంపై నిర్భయ తల్లి ఆశాదేవి ప్రతీసారి ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు.
Recommended Video
ఇదీ కేసు నేపథ్యం..
2012లో పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై ఆరుగురు మృగాళ్లు లైంగికదాడి చేసి, దాడి చేసిన సంగతి తెలిసిందే. బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోగా.. దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. దోషి రామ్ సింగ్, తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకోగా.. మరొకడు జువైనల్ హోం నుంచి బయటకొచ్చాడు. మరో నలుగురు దోషులు పవన్ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్ సింగ్, ముఖేశ్ కుమార్ జైలులో ఉన్నారు. వీరికి కోర్టు ఉరిశిక్ష విధించగా.. రాష్ట్రపతి క్షమాభిక్ష కూడా తిరస్కరించిన సంగతి తెలిసిందే.