ఈ సారి తప్పించుకున్నట్టేనా?: నిర్భయ దోషుల పిటీషన్పై విచారణ మార్చి 5కు వాయిదా
న్యూఢిల్లీ: పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నలుగురు దోషులు మరోసారి ఉరిశిక్షను తప్పించుకున్నట్లుగా కనిపిస్తోంది. వారికి విధించిన ఉరిశిక్షను అమలు చేయడానికి ఉద్దేశించిన పిటీషన్పై విచారణను దేశ అత్యున్నత న్యాయస్థానం వచ్చేనెల 5వ తేదీకి వాయిదా వేసింది. నలుగురు దోషులను వేర్వేరుగా ఉరికంబాన్ని ఎక్కించడానికి అనుమతి ఇవ్వాలంటూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు దాఖలు చేసిన పిటీషన్ అది.
మూడోసారి కూడా తప్పించుకున్నట్టేనా?
నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో పవన్ గుప్తా, అక్షయ్ కుమార్ రాథోడ్, ముఖేష్ కుమార్ సింగ్, వినయ్ కుమార్ శర్మలకు ఉరిశిక్షను అమలు చేయడానికి ఢిల్లీ న్యాయస్థానం ఇదివరకే డెత్ వారెంట్ను జారీ చేసిన విషయం తెలిసిందే. దీని ప్రకారం.. వచ్చేనెల 3వ తేదీన తెల్లవారు జామున 6 గంటలకు ఈ నలుగురు దోషులకు తీహార్ కేంద్ర కారాగారంలో ఉరి తీయాల్సి ఉంది. తాజాగా- సుప్రీంకోర్టు వారి ఉరిశిక్షను అమలు చేయడానికి ఉద్దేశించిన పిటీషన్ను మార్చి 5కు వాయిదా వేసింది. ఫలితంగా- ఉరిశిక్షను అమలు చేయకపోవచ్చని తెలుస్తోంది.
ఇప్పటికే రెండుసార్లు మృత్యుముఖం నుంచి..
నిజానికి- నిర్భయ దోషులు ఇదివరకే ఉరికొయ్యకు వేలాడాల్సి ఉండేది. తొలిసారిగా జనవరి 22వ తేదీన వారికి ఉరిశిక్షను విధించడానికి అవసరమైన డెత్ వారెంట్ జారీ అయింది. అప్పట్లో నిర్భయ దోషుల్లో ఒకడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు క్షమాభిక్ష పిటీషన్ను దాఖలు చేయడం, దాన్ని ఆయన తిరస్కరించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రపతి క్షమాభిక్ష పిటీషన్ను తిరస్కరించిన తరువాత 14 రోజుల పాటు ఉరిశిక్షను విధించడానికి వీల్లేదనే నిబంధనల కింద వారు తప్పించుకున్నారు. ఫిబ్రవరి 1వ తేదీన ఉరి తీయాల్సి ఉన్నప్పటికీ.. చట్టపరమైన ఇబ్బందుల వల్ల సాధ్యం కాలేదు.
Recommended Video
మూడోసారి కూడా..
వచ్చేనెల 3వ తేదీన నిర్బయ దోషులకు ఉరిశిక్షను విధించడానికి ఢిల్లీ న్యాయస్థానం మూడోసారి డెత్ వారెంట్ను జారీ చేసింది. తాజాగా సుప్రీంకోర్టులో చోటు చేసుకున్న పరిణామాలను బట్టి చూస్తూ.. ఈ సారి కూడా సాధ్యమయ్యేలా కనిపించట్లేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. నిర్భయ దోషులకు వేర్వేరుగా ఉరిశిక్షను అమలు చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దాఖలు చేసిన పిటీషన్పై మంగళవారం ఉదయం సుప్రీంకోర్టు విచారించింది. అనంతరం దీన్ని వచ్చేనెల 5వ తేదీకి వాయిదా వేస్తూ ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.