ఉరితీతకు లైన్ క్లియర్: నిర్భయ దోషుల క్యురేటివ్ పిటీషన్లు కొట్టిపారేసిన కోర్టు: తెలుగు న్యాయమూర్తి..!
న్యూఢిల్లీ: దేశం మొత్తాన్ని వణికించిన నిర్భయ సామూహిక అత్యాచారం కేసులో ఉరిశిక్షను ఎదుర్కొంటున్న వినయ్ కుమార్ శర్మ, ముఖేష్ కుమార్ సింగ్ వేర్వేరుగా దాఖలు చేసుకున్న క్యురేటివ్ పిటీషన్లను దేశ అత్యున్నత న్యాయస్థానం కొట్టి పారేసింది. ఈ రెండు పిటీషన్లు విచారణకు అర్హమైనవి కావని తేల్చేసింది. విచారణకు స్వీకరించిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే సుప్రీంకోర్టు ధర్మాసనం తన అభిప్రాయాన్ని వెల్లడించింది.
డెత్ వారెంట్ వచ్చిన రోజే..
నిర్భయ కేసులో దోషులుగా తేలిన నలుగురిలో ఇద్దరు వినయ్ కుమార్ శర్మ, ముఖేష్ కుమార్ సింగ్ వేర్వేరుగా క్యురేటివ్ పిటీషన్లను దాఖలు చేశారు. ఈ నెల 22వ తేదీన ఉదయం 7 గంటలకు వారికి ఉరిశిక్షను అమలు చేయాల్సి ఉంది. ఈ మేరకు కొద్ది రోజుల కిందటే దేశ రాజధానిలోని పటియాలా హౌస్ న్యాయస్థానం డెత్ వారెంట్ను కూడా జారీ చేసింది. డెత్ వారెంట్ మంజూరైన రోజే.. వినయ్ కుమార్ శర్మ, ముఖేష్ కుమార్ సింగ్ తరఫున ప్రముఖ న్యాయవాది ఏపీ సింగ్ సుప్రీంకోర్టులో క్యురేటివ్ పిటీషన్ను దాఖలు చేశారు.
జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలో..
తెలుగువాడైన జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలో ఏర్పాటైన అయిదుమంది న్యాయమూర్తుల ధర్మాసనం ఈ క్యురేటివ్ పిటీషన్లపై మంగళవారం మధ్యాహ్నం భోజన విరామం అనంతరం విచారణ చేపట్టింది. ఎన్వీ రమణతో పాటు జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్ ఈ ధర్మాసనంలో ఉన్నారు. విచారణ చేపట్టిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే ధర్మాసనం ఈ క్యురేటివ్ పిటీషన్లను కొట్టి పారేసింది. దీనిపై విచారణ కొనసాగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.
ఉరితీతకు లైన్ క్లియర్..
2012 డిసెంబర్ 16వ తేదీన దేశ రాజధానిలో పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై కదులుతున్న బస్సులో అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడిన కేసులో ఆరుమంది దోషులుగా తేలిన విషయం తెలిసిందే. వారిలో రామ్సింగ్ ఇదివరకే ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకరు మైనర్గా తేలడంతో గరిష్ఠంగా మూడేళ్ల జైలుశిక్షను అనుభవించి, విడుదలయ్యాడు. ఇక మిగిలిన పవన్ కుమార్ గుప్తా, అక్షయ్ కుమార్ సింగ్, ముఖేష్ కుమార్ సింగ్, వినయ్ కుమార్ శర్మ ఉరిశిక్షను ఎదుర్కొంటున్నారు.
ఈ నెల 22వ తేదీన ఉరికి ఏర్పాట్లు..
న్యాయపరమైన చివరి అడ్డంకి కూడా తొలగిపోవడంతో.. ఇక ఈ నలుగురు కామాంధులకు ఉరిశిక్షను అమలు చేయడం ఒక్కటే మిగిలింది. ఈ నెల 22వ తేదీన ఉదయం 7 గంటలకు వారికి ఉరిశిక్షను అమలు చేయాల్సి ఉంది. దీనికి అవసరమైన డెత్ వారెంట్ కూడా జారీ అయింది. న్యూఢిల్లీలోని తీహార్ కేంద్ర కారాగారంలో ఉరితీతకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే రెండు దఫాలుగా ఉరి తీతపై ట్రయల్స్ను నిర్వహించారు జైలు అధికారులు.
ఉత్తర ప్రదేశ్ నుంచి తలారి..
ఈ నలుగురు కీచకులకు ఉరి తీయడానికి ఉత్తర ప్రదేశ్ నుంచి ఇద్దరు తలారులను రప్పించనున్నారు. ఒకేసారి వేర్వేరు ఉరి కొయ్యలపై వారిని వేలాడదీయనున్నారు. తీహార్ కేంద్ర కారాగారంలోని మూడో నంబర్ జైలులో ఉరిశిక్షను అమలు చేయనున్నారు. అనంతరం వారి మృతదేహాలను తరలించడానికి ప్రత్యేకంగా ఓ సొరంగ మార్గాన్ని తవ్వుతున్నారు అధికారులు. ఈ సొరంగ మార్గం గుండానే వారి మృతదేహాలను జైలు వెలుపలికి తరలిస్తారు.