నిర్భయ కేసులో షాకింగ్ ట్విస్ట్: ఉరిశిక్షపై 17న సుప్రీంలో పునర్విచారణ: లిస్టింగ్ నంబర్లు ఇవే..!
న్యూఢిల్లీ: నిర్భయ కేసులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, ఉరిశిక్షను ఎదుర్కొంటున్న అక్షయ్ కుమార్ సింగ్ దాఖలు చేసుకున్న రివ్యూ పిటీషన్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ నెల 17వ తేదీన పునర్విచారణ చేపట్టనుంది. ముగ్గురు సభ్యులు గల న్యాయమూర్తుల ధర్మాసనం ఈ రివ్యూ పిటీషన్ పై విచారించనుంది. ఈ మేరకు రివ్యూ పిటీషన్ ను లిస్టింగ్ లోకి చేర్చింది.
10న రివ్యూ పిటీషన్..
తనకు విధించిన మరణ శిక్ష తీర్పును పునఃసమీక్షించాలని కోరుతూ అక్షయ్ కుమార్ సింగ్ ఈ నెల 10వ తేదీన సుప్రీంకోర్టులో రివ్యూ పిటీషన్ ను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆయన తరఫున ప్రముఖ న్యాయవాది ఏపీ సింగ్ ఈ పిటీషన్ వేశారు. దేశ రాజధానిలో వాతావరణం అత్యంత విషపూరితంగా మారిందని, ఫలితంగా- జైల్లోనే సగం ప్రాణాలు పోయాయని అక్షయ్ కుమార్ సింగ్ ఈ పిటీషన్ లో పేర్కొన్నారు. పీల్చే గాలి, తాగే నీరు.. అంతా కాలుష్యం వల్ల తమ ప్రాణాలను హరించి వేశాయని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఉరిశిక్షను అమలు చేయడం వల్ల ఒరిగేదేమీ ఉండదని చెప్పారు.
17న మధ్యాహ్నం 2 గంటలకు విచారణ..
ఈ రివ్యూ పిటీషన్ ను సుప్రీంకోర్టు అదే రోజు విచారణకు స్వీకరించింది. ఈ నెల 17వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు దీనిపై విచారణ చేపట్టాలని తాజాగా నిర్ణయించింది. ఈ మేరకు లిస్టింగ్ లోకి చేర్చింది. ఆర్ పీ (క్రిమినల్) డీ నంబర్: 44603/2019, క్రిమినల్ అప్పీల్ నంబర్ 607610/2017, స్పెషల్ లీవ్ పిటీషన్ (క్రిమినల్) నంబర్లు: 31193120/2014 అనే నంబర్లను కేటాయించింది. ముగ్గురు సభ్యులు గల న్యాయమూర్తుల ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టనుంది.
16న ఉరి తీస్తారంటూ వార్తలు వస్తుండగా..
నిర్భయ కేసులో ఆరుమంది దోషులుగా.. 2012 డిసెంబర్ 16వ తేదీన దేశ రాజధానిలో చోటు చేసుకున్న నిర్భయ ఉదంతం.. దిగ్భ్రాంతికి గురి చేసిన విషయం తెలిసిందే. అత్యంత పాశవికంగా పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై కదులుతున్న బస్సులో అత్యాచారానికి పాల్పడ్డారు ఆరుమంది కామాంధులు. వారిలో రామ్ సింగ్ ఇప్పటికే ఆత్మహత్య చేసుకున్నాడు. మరొకరు మైనర్ గా తేలడంతో అతణ్ని జువైనల్ హోంలో శిక్ష విధించారు.
అనూహ్యంగా..విచారణ
ప్రస్తుతం అక్షయ్ కుమార్ సింగ్, వినయ్ శర్మ, పవన్ కుమార్ గుప్తా, ముఖేష్ సింగ్ లకు సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించింది. వారికి ఈ నెల 16వ తేదీన ఉరిశిక్ష విధించే అవకాశం ఉందంటూ వార్తలు వస్తోన్న నేపథ్యంలో.. అక్షయ్ కుమార్ సింగ్ రివ్యూ పిటీషన్ పై సుప్రీంకోర్టు 17న విచారణ చేపట్టడం షాకింగ్ ట్విస్ట్ గా చెప్పుకోవచ్చు. దీనిపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందనే విషయం ఇప్పటి నుంచే చర్చనీయాంశమైంది.. ఉత్కంఠతకు గురి చేస్తోంది.