నిర్భయ గ్యాంగ్రేప్: రాష్ట్రపతికి సవాల్: క్షమాభిక్షను ఎలా తిరస్కరిస్తారంటూ: నేడు సుప్రీంలో విచారణ..
న్యూఢిల్లీ: యావత్ దేశాన్ని వణికించిన పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై దేశ రాజధానిలో సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో ఉరిశిక్షను ఎదుర్కొంటున్న ముఖేష్ కుమార్ సింగ్ దాఖలు చేసిన పిటీషన్ మంగళవారం మధ్యాహ్నం దేశ అత్యున్నత న్యాయస్థానం సమక్షానికి రానుంది. మధ్యాహ్నం 12:30 గంటలకు ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ పిటీషన్పై విచారణ చేపట్టనుంది.
క్షమాభిక్ష తిరస్కరించడానికి వ్యతిరేకంగా..
నిర్భయ గ్యాంగ్రేప్ కేసులో ఉరిశిక్షను ఎదుర్కొంటున్న నలుగురు దోషుల్లో ఒకడు ముఖేష్ కుమార్ సింగ్. తనకు క్షమాభిక్షను ప్రసాదించాలంటూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు పిటీషన్ను దాఖలు చేయగా.. దాన్ని ఆయన తిరస్కరించారు. క్షమాభిక్షను తిరస్కరిస్తూ రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాన్నే సవాల్ చేస్తూ ఈ పిటీషన్ను దాఖలు చేశాడు ముఖేష్. ఎలాంటి కారణాలను చూపకుండానే రాష్ట్రపతి తన క్షమాభిక్ష పిటీషన్ను తిరస్కరించారని, తనకు న్యాయం చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు.
అర్జంట్ హియరింగ్ కింద..
ఈ పిటీషన్ను అత్యవసర విచారణ (అర్జంట్ హియరింగ్) కింద సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డె కొన్ని కీలక వ్యాఖ్యలను చేశారు. పిటీషనర్.. మరో నాలుగు రోజుల్లో ఉరికంబాన్ని ఎక్కాల్సి ఉన్నందున.. దీన్ని అర్జంట్ హియరింగ్ కింద పరిగణించాల్సి వచ్చిందని అన్నారు. ఉరి శిక్షను ఎదుర్కొనబోతున్న వ్యక్తి పిటీషన్పై విచారణ చేపట్టడానికి మించిన అత్యవసరం ఇంకేం ఉంటుందని బొబ్డే చెప్పారు. బొబ్డేతో పాటు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్లతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం పిటీషన్ను విచారించనుంది.
ఇక మూడు రోజులే..
నిజానికి- నిర్భయకేసులో ఉరిశిక్షను ఎదుర్కొంటున్న ముఖేష్ కుమార్ సింగ్ సహా, అక్షయ్ కుమార్ ఠాకూర్, వినయ్ కుమార్ శర్మ, పవన్ కుమార్ గుప్తాను వచ్చేనెల 1వ తేదీన ఉరిశిక్షను అమలు చేయాల్సి ఉంది. తీహార్ కేంద్ర కారాగారంలోని మూడో నంబర్ జైలులో తెల్లవారు జామున 6 గంటలకు ఆ నలుగురూ ఉరికంబం ఎక్కనున్నారు. ఈ మేరకు ఇదివరకే ఢిల్లీలోని పటియాలా హౌస్ న్యాయస్థానం వారికి డెత్ వారెంట్ను కూడా జారీ చేసింది.
డెత్ వారెంట్ను జారీ చేయడం రెండోసారి..
ఈ నలుగురు కామాంధులకు ఢిల్లీ న్యాయస్థానం డెత్ వారెంట్ను జారీ చేయడం ఇది రెండోసారి. ఈ నెల 22వ తేదీ నాడే వారిని ఉరి తీయాల్సి ఉండగా.. ముఖేష్ కుమార్ రాష్ట్రపతికి క్షమాభిక్షను కోరడంతో అది సాధ్యం కాలేదు. రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించిన తరువాత 14 రోజుల పాటు గడువు ఇవ్వాల్సి ఉండాల్సి రావడం వల్ల ఉరిశిక్షను అమలు చేయడం కుదరలేదు. ఫలితంగా- రెండోసారి డెత్ వారెంట్ను జారీ చేయాల్సి వచ్చింది.