నిర్భయ దోషుల ఉరితీత వాయిదా పడుతుందా?: నేడు సుప్రీంలో క్యురేటివ్ పిటీషన్పై విచారణ
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో పారామెడికల్ విద్యార్థిని నిర్భయపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో ఉరిశిక్షను ఎదుర్కొంటోన్న దోషి అక్షయ్ కుమార్ ఠాకూర్ దాఖలు చేసుకున్న క్యురేటివ్ పిటీషన్పై దేశ అత్యున్నత న్యాయస్థానం మరి కొన్ని గంటల్లో విచారణ చేపట్టనుంది. తనకు ఉరిశిక్షను విధించడాన్ని సవాల్ చేస్తూ అతను దాఖలు చేసుకున్న క్యురేటివ్ పిటీషన్ అది. వచ్చే శనివారం నిర్భయ దోషులకు ఉరి తీయాల్సిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పిటీషన్పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుండటం ఉత్కంఠతను రేపుతోంది.
తీహార్ జైలులో నిర్భయ దోషిపై అత్యాచారం, లైంగిక దాడి: న్యాయవాది సంచలన కామెంట్స్: తీర్పు రిజర్వ్..!
జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలో..
అక్షయ్ కుమార్ ఠాకూర్ దాఖలు చేసిన ఈ పిటీషన్పై అయిదుమంది సభ్యులు గల న్యాయమూర్తుల ధర్మాసనం విచారణ చేపట్టనుంది. జస్టిస్ ఎన్వీ రమణ సారథ్యంలో జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్, జస్టిస్ ఆర్ భానుమతి, జస్టిస్ అశోక్ భూషణ్ దీన్ని విచారించనున్నారు. అక్షయ్ ఠాకూర్ తరఫున ప్రముఖ న్యాయవాది అంజనా ప్రకాశ్ ఈ కేసును వాదించే అవకాశం ఉంది. ప్రభుత్వం తరఫున ఢిల్లీ సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరవుతారు.
మూడో క్యురేటివ్ పిటీషన్..
ఇదే కేసులో సుప్రీంకోర్టుకు అందిన మూడో క్యురేటివ్ పిటీషన్ ఇది. ఇదివరకు వినయ్ కుమార్ శర్మ, ముఖేష్ కుమార్ సింగ్ వేర్వేరుగా ఈ క్యురేటివ్ పిటీషన్లను దాఖలు చేసిన విషయం తెలిసిందే. ముఖేష్ కుమార్ సింగ్ ఏకంగా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ క్షమాభిక్ష తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయగా.. దాన్ని కొట్టివేసింది ధర్మాసనం. తాజాగా- అక్షయ్ కుమార్ ఠాకూర్ పిటీషన్ మరి కాస్సేపట్లో విచారణకు రానుంది.
ఉరిశిక్షను వాయిదా వేయించుకోవడానికేనంటూ..
ఉరిశిక్షను అమలు చేయడానికి ఉద్దేశించిన డెత్ వారెంట్ను జారీ చేసిన తరువాత ఈ పరిణామాలన్నీ ఒకదాని వెంట ఒకటి చోటు చేసుకుంటూ వస్తున్నాయి. ఉరిశిక్షను వాయిదా వేయించడానికే దోషులు ఇలా వరుసగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారంటూ ఇదివరకే నిర్భయ తల్లి ఆశాదేవి ధ్వజమెత్తారు. ఈ నెల 22వ తేదీ నాటికే అక్షయ్ కుమార్ ఠాకూర్, పవన్ కుమార్ గుప్తా, వినయ్ శర్మ, ముఖేష్ కుమార్ సింగ్లకు ఉరిశిక్షను అమలు చేయాల్సి ఉండగా.. రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటీషన్ను దాఖలు చేయడంతో కుదరలేదు.
సుప్రీం తీర్పుపై ఉత్కంఠత..
దీనితో రెండోసారి డెత్ వారెంట్ను జారీ చేయాల్సి వచ్చింది. దీని ప్రకారం.. వచ్చే శనివారం తెల్లవారు జామున 6 గంటలకు నలుగురు కామాంధులను ఉరికంబం ఎక్కించాల్సి ఉంది. ఈలోగా అక్షయ్ కుమార్ సింగ్ క్యురేటివ్ పిటీషన్ను దాఖలు చేయడం, దాన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించడంతో మరోసారి ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పిటీషన్పై సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుపైనే నిర్దేశిత సమయానికి వారికి ఉరిశిక్షను అమలు చేస్తారా? లేదా? అనేది ఆధారపడి ఉందని నిపుణులు చెబుతున్నారు.