నిర్భయ కేసు : ఉరిశిక్షకు కొద్ది గంటల ముందు హైకోర్టులో స్టే పిటిషన్..
నిర్భయ కేసులో ఉరిశిక్ష పడ్డ నలుగురు దోషులు.. చివరి నిమిషం వరకు శిక్ష నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. గురువారం(మార్చి 19) మధ్యాహ్నం మరణశిక్ష స్టే పిటిషన్ను ఢిల్లీ పటియాలా హౌజ్ కోర్టు కొట్టివేసినప్పటికీ.. దోషులు ఆఖరి ప్రయత్నంగా ఢిల్లీ హైకోర్టులో స్టే పిటిషన్ దాఖలు చేశారు. ట్రయల్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ ముగ్గురు దోషులు హైకోర్టులో పిటిషన్ వేశారు.
జస్టిస్ మన్మోహన్ నేత్రుత్వంలోని బెంచ్ రాత్రి 9గంటలకు ఈ పిటిషన్పై విచారణ జరపనుంది. శుక్రవారం(మార్చి 20) తెల్లవారుజామున ఉరిశిక్షకు ఇంకా కొద్ది గంటలే ఉన్న సమయంలో దోషులు దాఖలు చేసిన ఈ పిటిషన్పై ఎలాంటి తీర్పు వస్తుందన్నది ఉత్కంఠ రేపుతోంది.
నిర్భయ కేసులో ఇప్పటికే మూడుసార్లు ఉరిశిక్ష వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. దోషులకు ఇంకా న్యాయ అవకాశాలు ఉండటంతో మూడుసార్లు శిక్ష వాయిదాపడింది.ఇప్పటికైతే దోషులంతా న్యాయ అవకాశాలను ఉపయోగించుకున్నారు. అయితే ఇప్పటికీ పవన్ గుప్తా రెండో క్షమాభిక్ష పిటిషన్,అక్షయ్ భార్య విడాకుల పిటిషన్ పెండింగ్లో ఉన్న కారణంగా దోషుల తరుపు న్యాయవాది శిక్షను వాయిదా వేయాలని పటియాలా కోర్టుకు అప్పీల్ చేయగా న్యాయస్థానం తిరస్కరించింది.