నిర్భయ దోషులకు ఉరి..రెడీ: ఒకేసారి నలుగురికీ..వేర్వేరు కంబాలు: తీహార్ లో జేసీబీ..టన్నెల్..!
న్యూఢిల్లీ: యావత్ దేశాన్ని వణికించిన నిర్భయ అత్యాచారం కేసులో నలుగురు దోషులకూ ఉరి వేయడానికి తీహార్ జైలు అధికారులు ఏర్పాట్లు ఆరంభించారు. ఈ నలుగురు కామాంధులను ఒకేసారి, ఒకే కంబానికి ఉరి తీయాలని నిర్ణయించారు. దీనికి అనుగుణంగా సన్నాహాలు చేశారు. అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తిచేశారు. తీహార్ జైలు మొత్తంను ఇప్పటికే లాక్డౌన్ చేశారు.
ఘాతుకానికి ఏడేళ్లు..
దేశ రాజధానిలో చోటు చేసుకున్న ఈ కిరాతక, అమానవీయ ఉదంతానికి ఏడేళ్లు పూర్తయ్యాయి. 2012 డిసెంబర్ 16వ తేదీన న్యూఢిల్లీలో ఆరుమంది కిరాతకులు కదులుతున్న బస్సులో నిర్భయపై రాక్షసంగా అత్యాచారానికి పాల్పడిన విషయాన్ని ఇప్పట్లో ఎవరూ మరిచిపోలేనిది. ఈ ఘటనలో రామ్ సింగ్, మహ్మద్, పవన్ కుమార్ గుప్తా, ముఖేష్ సింగ్, అక్షయ్ కుమార్ సింగ్, వినయ్ శర్మ దోషులుగా తేలారు.
ఒకరు ఆత్మహత్య.. మరొకరు విడుదల..
ఈ నలుగురిలో రామ్ సింగ్ తీహార్ జైలులో ఆత్మహత్య చేసుకున్నాడు. మైనర్ కావడంతో మహ్మద్ మూడేళ్ల జైలు శిక్షను అనుభవించి విడుదలయ్యాడు. మిగిలిన నలుగురు కామాంధులు ప్రస్తుతం తీహార్ కేంద్ర కారాగారంలో ఉంటున్నారు. వారిని ఉరి తీయడానికి ఏర్పాట్లు ఆరంభించారు తీహార్ జైలు అధికారులు. నలుగురినీ ఒకేసారి ఏకకాలంలోనే ఉరి తీయనున్నారు. దీనికోసం వేర్వేరు ఉరి కంబాలను ఏర్పాటు చేశారు.
మృతదేహాల తరలింపు కోసం టన్నెల్..
ఉరిశిక్షను అమలు చేసిన ఆ నలుగురి మృతదేహాలను తరలించడానికి తీహార్ కేంద్ర కారాగారంలో అధికారులు ప్రత్యేకంగా ఓ టన్నెల్ ను నిర్మిస్తున్నారు. ఉరి తీసిన ప్రదేశం నుంచి ఈ టన్నెల్ ద్వారానే నలుగురి మృతదేహాలను బయటికి తీసుకెళ్లనున్నట్లు అధికారులు చెబుతున్నారు. జైలు ప్రధాన ద్వారం గుండా మృతదేహాలను తరలించడం ఆనవాయితీ కాదనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. టన్నెల్ తవ్వడానికి ఓ జేసీబీని రప్పించారు అధికారులు. టన్నెల్ తవ్వకం పనులు కొనసాగుతున్నాయి.
దేశ చరిత్రలో తొలిసారిగా..
దేశానికిి స్వాతంత్య్రం సిద్ధించిన తరువాత నలుగురు దోషులను ఒకేసారి ఉరి తీయబోతుండటం ఇదే తొలిసారి. స్వతంత్ర భారత దేశ చరిత్రలో ఒకరికి మించి దోషులను ఒకేసారి ఉరి తీసిన సందర్భాలు అరుదు. ఒక్కసారి మాత్రమే అలాంటి సందర్భం చోటు చేసుకుంది. బిల్లా-రంగా అనే ఇద్దరు కరడుగట్టిన నేరస్తులను తీహార్ జైలులోనే ఒకేసారి ఉరి తీశారు. ఆ తరువాత.. ఒకరికి మించి ఉరి తీసిన సందర్భాలు చోటు చేసుకోలేదు.